Jaya Senapathi | జరిగిన కథ : అధికారిక సమావేశాలతో అలసిపోయిన చక్రవర్తి.. ఆరోజున సరాసరి నారాంబ అంతఃపురానికి వచ్చాడు. విశ్రాంతిగా పర్యంకంపై జారగిలబడ్డాడు. అయితే, ఎప్పుడూ దేవళపు గంటలా గణగణా మోగుతూ ఉండే నారాంబ.. మౌనంగా ఉండటంతో గణపతిదేవుడు ఆశ్చర్యపోయాడు.
ఆమె చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది. ఆమె అందమైన ముఖం చింతాక్రాంతమై ఉన్నది. తాటిముంజల్లాంటి కనుదోయి గిరుగిర్రున తిరుగుతున్నాయి. ఆమెను చూస్తేచాలు.. గణపతిదేవుని అలసట మటుమాయమై పోతుంది. మాట వింటే చాలు.. హాయిగా నవ్వుకోవచ్చు.
అప్పుడే పరిచారికలు పిల్లలను తీసుకువచ్చారు. వాళ్లిద్దరూ తండ్రి వైపు పరుగులు పెడుతూ వచ్చి.. ఆయన తొడలపైకి ఎగబాకారు. మరో పరిచారిక బంగారు కోరలో చల్లని మజ్జిగ అందించింది. మరోకామె వేడివేడి జున్నుముక్కలున్న పళ్లెరం ఆయన ముందుంచింది. మరో పరిచారిక చేతులు కడుక్కోవడానికి పాత్ర ముందుంచగా.. అందులో చేతులు శుభ్రపరచుకుని జున్నుముక్కల పళ్లెరం అందుకుంటూ..
“ఊ.. ఏమిటి? మహారాణి వారు సుదీర్ఘంగా ఆలోచించడానికి కారణం ఏమిటో..?” అని అన్నాడు.
“ఏమీ లేదండి. మన జాయపుడు.. రోజూ ఎవ్వరికీ చెప్పకుండా బయటికి వెళ్తున్నాడు..” అన్నదామె. ఆయనకు అలసటంతా ఎగిరిపోయింది.
“అలాగా!? అయినా జాయపుడు దినమూ నాట్య గురుకులానికో.. మిత్రుల వద్దకో.. బౌద్ధారామాలకో.. జైన గ్రంథాలయాలకో.. ఘటికలకో వెళ్తూనే ఉంటాడుగా! ఇందులో ఆశ్చర్యమేమున్నది..?”.
ఆమె ఆయన చెవి వద్ద వంగి..
“వాడు మారువేషంలో వెళ్తున్నాడు..” అని చెప్పింది. ఆయనలోని హాస్యధోరణి మాయమైంది.
“మారువేషంలో వెళ్లడం ఏమిటి? చారులకు ఎవ్వరికైనా చెప్పకపోయావా.. పరిశీలించమని!” అన్నాడు.
“పాపం.. తెలిస్తే వాడు బాధపడతాడండీ!”.
“అబ్బా.. అయితే తమరు దీర్ఘంగా ఆలోచించడం ఎందుకూ!? జాయపుడేమీ తప్పు చెయ్యడు. అనుమకొండ వీధులు, డొంకలు క్షుణ్నంగా తెలిసినవాడు. లోకంపోకడ అర్థం చేసుకున్నవాడు. దారి తప్పడు.. ఏ రాత్రి అయినా నీ మందిరానికే చేరతాడు!”. చెబుతూనే ఆలోచనలో పడ్డాడు.
‘మారువేషం ఎందుకబ్బా!?’.
“ఎవరైనా పల్లెటూరి అమ్మాయి కోసమని.. నా సందేహం! అసలే అందగాడు. పైగా మీ బావమరిది!”. అప్పుడే లోపలికివచ్చాడు జాయపుడు. ఆమె భర్తను మోచేత్తో పొడిచి.. “అడగండి. ఎక్కడికి వెళ్లివస్తున్నాడో!” అన్నది.
‘అడిగితే బావుండదు’ అన్నట్లు కళ్లతో చెప్పి, జాయపుణ్ని చూసి పలకరింపుగా నవ్వాడు. రైతుదుస్తుల్లో ఉన్న జాయపుడు వినయంగా నమస్కరించి నవ్వి.. “దుస్తులు మార్చుకుని వస్తాను బావగారూ..” అంటూ లోపలికి వెళ్లిపోయాడు. ఆయన పిల్లలతో ఆడుకుంటున్నాడు. నారాంబ కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నది.
“ఒక్కరోజు చూసి ఆడిగితే ఏమైనా అనుకుంటాడు. కారణం లేనిదే అలా వెళ్లడు. మరోవారం చూశాక అడుగుదాం..” అన్నాడు చక్రవర్తి.
అంగీకరించక తప్పలేదు నారాంబకు. మరోవారం రోజుల తర్వాత.. మళ్లీ సమస్య లేవదీసింది గణపతిదేవుని వద్ద. “వాడు నిత్యం సాధారణ దుస్తుల్లో మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. మీరు చూడమన్నారని ప్రతినిత్యం కళ్లింత చేసుకుని చూస్తున్నా.. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం??”.గణపతిదేవుడు ఆలోచించి ఏం చెయ్యాలో చెప్పాడు.
‘వహోం వహోం హోం’.. మహారాణి వారి పల్లకి పోతూనే ఉంది. వెనుక అల్లంత దూరాన గుర్రాలపై రక్షక భటులు. పల్లకిలో కుదురుగా కూర్చోలేకపోతున్నది నారాంబ. మాటిమాటికీ తెర తొలగించి బయటికి చూస్తున్నది. అప్పటికే భటులు దగ్గరకొచ్చి చెప్పారు.. “మహారాణి.. తమరు పల్లకిలో ఉన్నట్లు ఎవరికీ తెలియదు. దయచేసి తెర తొలగించకండి. ఆ గ్రామం దగ్గరికి రాగానే మేమే తెలియపరుస్తాం!” అని.
“అలాగే!” అన్నది కానీ.. ఆమె తన ఉత్సుకతను అణచుకోలేకపోతున్నది. చివరికి నిర్దేశించిన గ్రామంలో.. గ్రామస్తులు చూపిన ఊరిచివర మర్రిమాను వద్ద పల్లకి ఆగింది. ఈవల చావిడి నీడలో విక్రమ..
కనిపించినంత మేరా భూమి, ఆకాశం పచ్చ, నీలిమల కలనేత కోక కట్టినట్లుంది. ఈవలగా పొలంలో నాట్లువేస్తూ కొందరు స్త్రీలు ఏదో పాట పాడుతున్నారు. అక్కడ గట్టుపై కూర్చునున్నాడు జాయపుడు.
వారందరి మధ్య ఓ పాట.. ఓ లయ.. ఎప్పుడూ చూడని ఆ దృశ్యం వింతగా ఉంది నారాంబకు. పల్లకి దిగి మెల్లగా అతని దగ్గరగా వెళ్లింది.
ఓ రాజకుమారుడు.. గొప్ప నాట్యకారుడు, గేయకారుడు, సంగీతజ్ఞాని.. ఇలా ఎర్రటిఎండలో, ఓ పల్లెటూర్లో, ఓ రైతు వేషంలో, పొలం గట్టుపై కూర్చుని నాట్లువేస్తున్న స్త్రీలతో పాటలు పాడటం ఏమిటి??
గమ్మత్తుగా ఉన్న ఆ దృశ్యం.. ఆమెలో కోపాన్నే కాదు, కొంత ఆసక్తినీ రేకెత్తించింది. మర్రిమాను చాటుగా చెవులు రిక్కించి వినసాగింది. వంగి అంతా నాట్లు వేస్తూ బృందంగా ఏకకంఠంగా పాట పాడుతున్నారు.
“నేలలో ఇత్తులు లేవే అత్తప్పా.. నాటే సేలో నవ్వుల పూతలు కాత్తన్నాయే ఓలప్పా..” గట్టుపై కూర్చుని చిటికె వేస్తూ అరమోడ్పు కళ్లతో వారి పాటను పరిశీలిస్తూ.. తనూ పాడుతూ కొత్త చరణాలు పెంపొందిస్తున్నాడు జాయపుడు. వాళ్లు తప్పు చేస్తే ఆపి సరిచేస్తున్నాడు. ఆ ఆడవాళ్లంతా తన తమ్మునితో.. వాడు చెప్పినట్లు పాడటం నారాంబను విస్తుపోయేలా చేసింది.
‘వీడికేమైనా పిచ్చెక్కిందా..’ ఆమె దిగులు పడింది. వెనుక వస్తున్న రక్షకభటుల బృందం దగ్గరయ్యేసరికి విక్రమ గట్టిగా సకిలించాడు. అప్పుడే జాయపుడు, ఆ మహిళలు తల తిప్పి చూశారు.
దగ్గరగా అక్క నారాంబ. విస్తుపోయాడు జాయపుడు. ఆ మహిళలు కూడా! పల్లకి, గుర్రాలు.. ఓ కులీన స్త్రీ! గట్టుపైనుంచి లేస్తూ..
“అక్కా.. నువ్వేంటి ఇక్కడ?” అంటూ దగ్గరగా వెళ్లాడు.
“ఇదేమిట్రా జాయా.. ఏమిటీ వేషం!? ఈ ఎర్రనిఎండలో వీళ్లతో ఏమిటా పాటలు? రాజభవనంలో లేకపోతే.. గురుకులంలో పాడుకోకుండా ఇక్కడ?.. ఏమైందిరా నీకు??”..
ఆమె ఎంత గందరగోళంగా ఉన్నదో.. ఆ మాటల్లోనే తెలుస్తున్నది. ఏం చెప్పాలో తెలియక ఆమెను పల్లకి వద్దకు లాక్కుని పోయాడు. మరోజాము దాటాక పటాలమంతా రాజప్రాసాదానికి.. అంతఃపురానికి చేరారు. నారాంబ చెప్పిందంతా విని పగలబడి నవ్వుతూనే ఉన్నాడు గణపతిదేవుడు. అలా నవ్వి నవ్వి ఆసనంలో కూలబడి రొప్పుతూనే ఉన్నాడు. పిల్లలను ఆడిస్తూ పరిచారికలు కూడా ముసిముసిగా నవ్వుతున్నారు. చక్రవర్తి నవ్వారు కాబట్టి.. వాళ్లు భయపడకుండా నవ్వుతున్నారు.
దిగులుగా నారాంబ.. తలవొంచుకుని జాయపుడు! “వాడి పిచ్చిచేష్టలు.. కాస్త అర్థం చేసుకుని వాడికి వెంటనే వివాహం తలపెట్టండి మహానుభావా..” అన్నది నారాంబ ఆందోళనగా.
“సరే.. సరే! మరోసారి వివరంగా చెప్పు జాయా!” అన్నాడు గణపతి. నవ్వుతున్నా.. జాయపునిలోని కళాసక్తి ఆయన్ను సంతోషపరచింది.
“ఆ గ్రామంలో రైతుమహిళలు పొలం పనిలో అద్భుతమైన జానపదాలు ఆలపిస్తున్నట్లు గురుకులంలో తెలిసి అక్కడికి వెళ్లా. వాళ్లు గురుకులం నుంచో.. రాజాస్థానం నుంచో వచ్చిన వాళ్లంటే బిగదీసుకుపోతున్నారు. సహజమైన పాట వారినుంచి రావడం లేదు. అందుకే నేను సాధారణ రైతు వేషంలో వెళ్లి, వాళ్లతో కలసిమెలసి కబుర్లుచెబుతూ.. వారి సహజమైన పాటలను పాడిస్తున్నాను. వాళ్ల పాటల్లోని తప్పొప్పులను సరిచేస్తూ, ఆ పాటలను మరింత రంజుగా మార్చుతున్నాను. ఈమాత్రం దానికి పల్లకి ఎక్కి నన్ను వెదుక్కుంటూ అక్కడికి రావాలా? అక్కంటే సరే.. వెర్రిమాలోకం! మీరు కూడా ఏమిటి బావగారు.. పల్లకి, రక్షక భటులనిచ్చి పంపడం!”.
మళ్లీ నవ్వడం మొదలెట్టాడు గణపతిదేవుడు. నారాంబ ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటున్నది.
జాయపుడు ఆమె దుఃఖిస్తే చూడలేడు. దగ్గరగా వెళ్లి.. “పాట కోసం వెళ్లాను. ఇంక ఎప్పుడూ వెళ్లనులే అక్కా.. ఊరడిల్లు!”. ఆమె ముక్కుపుటాలు మరింత ఎగరేస్తున్నది. “నీకోసం అంతదూరం వస్తే ఏమన్నావ్.. వెర్రిమాలోకమా నేను??”.ఏం చెప్పాలో తెలియక జాయపుడు మెలికలు తిరిగిపోతుండగా.. మరింత నవ్వుతున్నాడు గణపతి.
ఓరోజు మిత్రబృందంతో వచ్చి జాయపుణ్ని కలిశాడు పుళిందపుడు. “మిత్రమా.. ఉద్యానవనంలో మిత్రులంతా ఆటలాడుతున్నారు.. దండరాసకం. నువ్వు కూడా పాల్గొనవచ్చు కదా! లే.. లే..” అన్నాడు.
జాయపుడు కూడా ఆసక్తిగా లేచాడు. రాజనగరిలో భవనాల మధ్య ఉద్యానవనం. కేవలం నగరి నివాసులకే ప్రవేశం.. అంతా తెలిసిన మిత్రులే! పుళిందపుడు, శ్రీకంఠప, ముమ్మడినాయకుడు, భూలోకయ, సోమశేఖరుడు, వరదయ, లకుమయ, గీర్వాణ, సుగ్రీవ, శైలబాల, మకరందుడు, మదయంతిక, లవంగిక, ఇంద్రాణి, మందారిక, కామందకి, అవలోకిత.. జాయపుణ్ని చూసి అందరిలో ఉత్సాహం పెరిగింది. అప్పుడు చూశాడు.. ఆ బృందంలో ఇంద్రాణి.
ఇద్దరూ కళ్లతోనే పలకరించుకున్నారు. ఇద్దరి పెదవులు చిరునవ్వుల పరిమళాలు వెదజల్లాయి. అందరూ గోలగోలగా బిడియాలు, రాచరిక గౌరవమర్యాద పద్ధతులు వదిలేసి.. నిజమైన సన్నిహితుల్లా మాట్లాడుకుంటున్నారు. జాయపుడు మెల్లగా ఇంద్రాణి వైపు కదులుతుండగా ఇంద్రాణి కూడా అలాగే కదులుతున్నది. మరి రెండు ఘడియలకు ఇద్దరూ దగ్గరగా వచ్చారు. ఒకరి శరీరపు పరిమళం మరొకరిని మధురమాధుర్యంగా చుట్టేస్తున్నది.
అతనేదో అన్నాననుకున్నాడు.. పెదవులు కదిలాయి గానీ, అనాహత నాదమే! పద రహితమైన శుద్ధ సంగీతమే! ఆమె చేతులకున్న గోరింటవర్ణాలతో గాజులశబ్దాలు సయ్యాటలాడుతున్నాయి. ఆమె శరీరంలా ఆమె చేతులు, వేళ్లు కూడా తామరతూడుల్లా పరమ కోమలంగా ఉన్నాయి. అన్నివైపులుగా ముఖంపైకి ఉరుకుతున్న ముంగురులను ఆమె కోపగించుకుంటూ సవరించుకుంటున్న తీరు ఆహ్లాదంగా ఉంది. దగ్గరితనం వల్ల ఆమె నాసిక వెలారుస్తున్న వేడినిట్టూర్పులు జాయపునిలో రసైక కెరటాలై ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
అలా చాలాసేపు ఉన్నారు కానీ ఎవ్వరూ ఒక్కమాట.. మాట్లాడలేకపోయారు. ఎవరో గట్టిగా అరిచి జాయపుణ్ని పిలిచారు. అంతలోనే మరెవ్వరో ఇంద్రాణిని కూడా పిలిచారు. ఇద్దరి చేతుల్లో దండియలు వచ్చి చేరాయి. ఇద్దరూ ఆడటానికి ఉద్యుక్తులయ్యారు. అంతా క్రీడాకారులయ్యారు. దండరాసకం.. భరతఖండమంతటా వివిధ రాజ్యాలలో.. మార్గి, దేశీ పద్ధతుల్లో ఆడే అత్యంత సరళమైన ఆట.
నృత్తం లాగానే ఎలాంటి పాట, నాట్యాంశం లేకుండా పూర్తి శుద్ధసంగీతంపై చేసే నర్తనమే ఈ ఆట కూడా.
రెండు చేతులతో రెండు దండియలు పట్టుకుని శరీర కదలికలతో ఓ దండియను ముందున్న వారి దండియతోనూ.. మరో దండియను వెనకున్నవారి దండియతోనూ లయబద్ధంగా, సంగీతబద్ధంగా తాకిస్తూ గుండ్రంగా తిరుగుతూ ఆడేదే దండరాసకం. దండలు లేదా కోలలు అన్నా కర్రలే. కాబట్టి కొన్నిప్రాంతాలలో కోలాటం అని కూడా అంటారు. అక్కడ ఏర్పాటుచేసిన చిన్నవేదికపై ఇద్దరు వాద్యకారులు సిద్ధంగా ఉన్నారు.
ఇక్కడ మరోవిశేషం.. ఉద్యానవనంలో ఆట నిర్దేశించిన ప్రదేశమంతా చాలా వృక్షాలు అల్లుకుని ఉన్నాయి. ఆ బలిష్ఠమైన చెట్లకొమ్మలకు గోగునార పాయలు పాయలుగా వేలాడదీశారు. అందరూ వాటిని ఆశ్చర్యంగా చూశారు. ఇవన్నీ ఎందుకు?
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284