Jaya Senapati katha| జరిగిన కథ : తన యుద్ధ నైపుణ్యాలతో శత్రు సైనికులను భయపెట్టాడు జాయప. తొలిరోజు పోరు ముగిసేసమయానికి.. పూర్తి యుద్ధ వీరుడయ్యాడు. రణక్షేత్రంలో జాయప వీరవిహారం.. చౌండకు చేరింది. రుద్రయసేనాని సూచన మేరకు జాయపను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు చౌండ. కొందరు మెరికల్లాంటి యువవీరులను కూడా అప్పగించాడు.
కాకతీయ సైన్యం పైచేయి సాధిస్తున్నట్లు తెలియడంతో పృథ్వీశ్వరుడు ముఖ్య సేనానులను హెచ్చరించాడు.
“ఇది మనకు చావో రేవో తేల్చే యుద్ధం! మనమే కాకతీయులను రెచ్చగొట్టి యుద్ధానికి పిలిచాం. మనం విజయంతో మాత్రమే తిరిగివెళ్లాలి!”..
అతని తీవ్ర హెచ్చరిక వాళ్లపై బలంగానే పనిచేసినా.. అవతల అంతకంటే తీవ్రంగా శ్రమిస్తున్నవాడు జాయప. ఎక్కటీలను గజవ్యూహానికి జతచేశాడు. యుద్ధభూమిలో జాయప అప్పటి కప్పుడు రూపొందించిన సరికొత్త వ్యూహాలు శత్రువులకు అర్థంకావడం లేదు. శత్రువులు తెగించి పోరాడుతున్నారని జాయప గ్రహించాడు. శత్రువు తెగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వాళ్లను సంహరించడం కొంత తేలిక అవుతుంది కూడా!
శత్రు శిబిరంలో చురుకుగా ఉన్న ఇద్దరు వేగులను తనకు స్వాధీనం చేయాల్సిందిగా చౌండ సేనానిని కోరాడు జాయప. వెంటనే ఏర్పాటుచేశాడు చౌండ. పృథ్వీశ్వరుడు యుద్ధభూమికి వచ్చే సమాచారం ముందుగా తెలియజేయడం వాళ్ల ప్రత్యేక విధి.అలా.. జాయప ఓ సేనాపతి స్థాయిలో పాతిక గజబృందాలు, వ్యక్తిగత సైనికుడు, శిక్షకులు, గూఢచారులను ఏర్పాటు చేసుకున్నాడు. కొందరు మెరికల్లాంటి సేనానులు.. పైన సేనాపతి సుబుద్ధి.. ఆపైన చౌండ.కంటక ఎల్లవేళలా జాయపను నీడలా వెన్నంటి ఉంటాడు. నాగంభట్టు శిక్షణబృందాలను పర్యవేక్షిస్తుంటే.. వేగుల సహాయంతో శత్రువు కదలికలను పరిశీలించసాగాడు త్రిపుర.
యుద్ధభూమిలో చొచ్చుకుపోతున్నాడు జాయప. రణరంగంలో ఇప్పుడు కాకతీయ సైన్యపు ఆధిపత్యం స్పష్టమవుతున్నది. ఇదే అదనుగా సర్యసైన్యాధ్యక్షుడు చౌండ సేనాని మరింత దూకుడుగా యుద్ధతంత్రాలు పన్నుతున్నాడు. జాయప యుద్ధరంగంలో ఉన్నట్లు చక్రవర్తికి, పినచోడుడికి తెలియకపోయినా.. యువవీరుల దూకుడు వల్ల యుద్ధంలో పైచేయి సాధిస్తున్నట్లు వారు భావిస్తున్నారు.
ఆరోజు యుద్ధరంగంలో పృథ్వీశ్వరుడు పాల్గొనబోతున్నట్లుగా జాయపకు ముందే వార్త అందింది. ఆవైపు తన గుర్రాన్ని నడిపాడు జాయప. వెనక రథంపై కంటక, నాగంభట్టు, త్రిపుర.
మూర్తీభవించిన రాజదర్పానికి చిహ్నం పృథ్వీశ్వరుడు. మత్తగజంపై అంబారి నిండుగా ఉన్న రూపం, దబ్బ పండుఛాయలో గుబురుమీసాలతో ఆకర్షణీయమైన తలపాగాతో.. అసలుసిసలు మహారాజులా ఉన్నాడు. చుట్టూ అంగరక్షకులు.. ఆవల ఈవల మహా మహా వీరులైన సేనానులు. అతని కదలిక పెద్ద యుద్ధ పటాలంలా సాగుతుంటే.. శత్రుపక్షంకూడా చూస్తున్నదే కానీ ఆయుధం విసరడం లేదు.
మిత్రులతో పకపకా నవ్వాడు జాయప.
“ఇదేదో యుద్ధ ప్రదర్శనలా ఉందే కానీ, భయపెట్టే యుద్ధ పన్నాగంలా లేదు!”.. మిత్రులు కూడా నవ్వారు.
“ఈయనగారు యుద్ధం చెయ్యలేడు. బాగా తిని అలంకరించుకున్న మహారాజు.. నాట్య ప్రదర్శనకు వచ్చినట్లున్నాడు గానీ యుద్ధం చేయడానికి, శత్రువును సంహరించడానికి వచ్చినట్లుగా లేడు..” అన్నాడు నాగంభట్టు. త్రిపుర నవ్వలేదు.
“కానీ.. కానీ వీడు మహాయోధుడని.. తెల్లవారక ముందే యుద్ధశిబిరం వద్ద సైతం యుద్ధాభ్యాసం చేస్తున్నట్లు మన వేగులు చెబుతున్నారు మరి!”.. ‘శత్రువును తక్కువ అంచనా వేయవద్దు!’ అన్న ధ్వని ఉంది అతని మాటల్లో. నిజమే!
ఊహాతీతంగా పృథ్వీశ్వరుడు తలపాగా తీసి పక్కన పెట్టి.. హఠాత్తుగా అంతెత్తు గజంపై ఉన్న అంబారినుంచి కిందికి ఉరికాడు. కరవాలాన్ని ఝళిపిస్తూ దగ్గర్లోనున్న శత్రు సైనికులపై విరుచుకుపడ్డాడు. ఘడియ కాలంలో అతని కరవాలానికి నలుగురు కాకతీయ సైనికులు నేలకొరిగారు.
కంటక పళ్లు కొరుకుతూ ముందుకు ఉరకబోయాడు. కానీ, జాయప అతణ్ని చటుక్కున పట్టి పక్కకు తోసి.. రథాన్ని పక్కకు పోనివ్వాల్సిందిగా రథికుడికి చెప్పాడు. జాయప బృందం అక్కణ్నుంచి రెండు ఘడియల్లో దూరంగా జరిగింది. నిజానికి జాయప.. పృథ్వీశ్వరుణ్ని ప్రత్యక్షంగా చూసి, అతణ్ని అంచనా వేయడానికి యత్నిస్తున్నాడు.
“ఆడు రాజు కాదు. వొట్టి యదవ సిన్నదేవరా! నన్ను ఆపావు కానీ, నేను ఆడ్ని నా బరిసెతో పొడిచి పొడిచి సంపేవోడిని.. లేదో.. ఆడి సేతిలో సచ్చేవోడిని!” అన్నాడు కంటక తీవ్ర ఉద్రేకంతో.
“జాయప నిన్ను పక్కకు తప్పించడం మంచిదయ్యింది కంటకా! ఆయన మహారాజు. కాకతీయులను యుద్ధానికి ప్రేరేపించినవాడు. ఆయన పక్కన మహాయోధులున్నారు. అతనిపైకి లంఘించడానికి జాయప కూడా సిద్ధంగానే ఉన్నాడు. కానీ, అది సమయం కాదు..” అన్నాడు నాగంభట్టు.
“భట్టు చెప్పింది నిజం కంటకా! ఆయన చాలా దుర్మార్గుడు. మహా కుటిల మనస్కుడు..” అన్నాడు త్రిపుర.
“ఆయన ఓ మహారాజు. ఆయనను అంచనా వెయ్యడానికి మనం వచ్చాం. అది మరువరాదు. ఆయన ప్రవర్తన మహారాజు స్థాయిలో లేదు. చక్రవర్తితో యుద్ధం ఏమి చేస్తాడు.. ప్చ్..” అన్నాడు జాయప.
పృథ్వీశ్వరుణ్ని ఎదుర్కోవడానికి కావాల్సిన వ్యూహం.. అతనిలో రూపుదిద్దుకుంది.
పృథ్వీశ్వరుని ప్రవర్తన కాకతీయ శిబిరంలో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణ సైనికులను చంపాడట!!
మంత్రాంగవేత్తల అభిప్రాయం.. ఆయన శత్రువులను రెచ్చగొట్టానికి ఆ పనిచేశాడు!!
మరునాడు గణపతిదేవ చక్రవర్తి యుద్ధక్షేత్రానికి వచ్చాడు. పృథ్వీశ్వరుని వెకిలి చేష్టలు ఆయనను బాగా రెచ్చగొట్టాయి. పూర్తి రాజరిక లాంఛనాలతో యుద్ధ
భూమిలోకి వచ్చిన గణపతిదేవుడు ఇనుముతో చేసిన పౌరుష విగ్రహంలా తోచాడు జాయపకు. రంగమండపంలో చూసిన గణపతిదేవునికి.. యుద్ధవీరుడుగా చూస్తున్న ఈ గణపతిదేవునికి ఉన్న వ్యత్యాసం జాయపను ఉత్తేజితుణ్ని చేసింది.
చక్రవర్తి అంటే అలా ఉండాలి!!
శత్రువు ఎదురైతే అప్పటికప్పుడు ద్వంద్వయుద్ధానికి సిద్ధమన్నట్లు.. ముఖాన చిరునవ్వు లేని చక్రవర్తి మహా ఉద్రిక్తంగా కనిపించాడు. ఆయనను చూశాక జాయప బృందమంతా ఉద్రేకంతో ఊగిపోయారు. ఆయన పర్యటన జాయప బృందాన్నే కాదు.. మొత్తం యుద్ధక్షేత్రాన్ని కదిలించి వేసింది.
జాయప ఊహించినట్లే గణపతిదేవుడు, పృథ్వీశ్వరుడు నిత్యమూ యుద్ధక్షేత్రానికి వస్తున్నారు. కాకతీయ యుద్ధ మంత్రాంగవేత్తలు ప్రత్యేక జాగ్రత్తలు ఏమి తీసుకున్నారో గానీ, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తన గజబృందాలకు జాయప హెచ్చరికలు జారీచేశాడు. మిత్రులను కూడా పలుమార్లు హెచ్చరించాడు.
“ఏదో జరగబోతున్నది. ఇద్దరు అత్యుత్తమ శత్రువులు ఇక్కడ తలపడబోతున్నారు. మనం మన అవకాశం కోసం సిద్ధంగా ఉండాలి!”..
జాయప చెప్పినట్లుగానే ఒకానొక దుర్ముహూర్తాన ఇటు గణపతిదేవుడు, అటు పృథ్వీశ్వరుడు ఎదురూ బదురయ్యారు. జరిగిన అవమానంతో దహించుకుపోతున్న గణపతిదేవుడు, దగ్గరలో పృథ్వీశ్వరుడు ఉన్నాడని తెలుసుకుని తన గజాన్ని అటు పోనివ్వమన్నాడు.
హఠాత్తుగా ఎదురైన గణపతిదేవుణ్ని చూసి పృథ్వీశ్వరుడు వికటాట్టహాసం చేస్తూ మీసం దువ్వాడు.
“నిలు నిలు పిల్లకుంకా! నువ్వా నాతో తలపడేది? ఇదేం యాదవరాజుతో పోరాడలేక.. సంధిగా వాడి కూతుర్ని పెండ్లాడి, రాజ్యం దక్కించుకోవడం కాదు. నీకు నువ్వే చక్రవర్తిగా ప్రకటించుకుని మురిసిపోవడం కాదు. రా.. దమ్ముంటే నాతో యుద్ధంచేసి నన్ను గెలువు. అప్పుడు.. అప్పుడు గుర్తిస్తా. నిన్ను చక్రవర్తిగా..” అంటూ బాణం సంధించాడు పృథ్వీశ్వరుడు.
గణపతిదేవుడు పళ్లు పటపట కొరుకుతూ..
“నా సేనానుల ముందు నిలబడలేక సాధారణ సేనలను చంపిన పిరికిపందవు. నా ముందుకొచ్చావు. చావు ఆసన్నమయ్యింది నీకు.. అందుకే ఆ వదరు మాటలు!”..
ఇద్దరూ విల్లు ఎక్కుపెట్టి బాణాలు విసురుకుంటున్నారు. వారివారి అంగరక్షకులు ఆయా బాణాలను ఖండిస్తున్నారు. చుట్టూ ఉన్న సైనికులు, దళపతులు, సేనానులు, సేనాపతులు అంతా పరస్పరం తీవ్రయుద్ధంలోకి దిగారు. అవతలగా మాటువేసి అదును కోసం చూస్తున్నారు.. జాయప బృందం. అప్పటికే పది గజబృందాలను సిద్ధంచేసి ఉంచాడు జాయప. దాదాపు డబ్భు ఏనుగులు. చిన్న ఈటెలు
విసరడంలో మంచి అనుభవం ఉన్నవి. పైన మావటీలు కూడా కనురెప్పపాటులో ఈటెను ఏనుగుకు అందించగలరు. యుద్ధం రానురానూ తీవ్రమవుతున్నది.
జాయప, కంటక, నాగంభట్టు, త్రిపుర.. ఆయుధాలను, శిరస్ర్తాణం, రక్షణ కవచాలను సరిచూసుకుంటూ రెప్ప వెయ్యకుండా పొంచి చూస్తున్నారు.. అవకాశం కోసం.
“సిద్ధమా.. కంటకా! నీ లక్ష్యం శత్రు సర్వసైన్యాధ్యక్షుడే.. మా లక్ష్యం తతిమా సేన్యాధ్యక్షులు. నేను చక్రవర్తికి సహాయపడతా. నీ కరవాలానికి పనిచెప్పు”.. కంటకను రెచ్చగొట్టాడు జాయప. అందరూ తమతమ శత్రువులను ఎంచుకుంటూ సిద్ధంగా ఉన్నారు.
“నా బూర కూజితం చెయ్యగానే ఏనుగులను మెల్లగా ఎవ్వరికి అనుమానం కలగకుండా ముందుకు ఆ వైపు పది.. ఈ వైపు పది.. మళ్లీ మరో వరస పాతిక.. పాతిక! అలా ఎవ్వరికీ అనుమానం కలగకుండా పంపాలి మామా. సరేనా.. జాగ్రత్త!!”.. సుబుద్ధికి చెప్పాడు.
“మీరిద్దరూ ముందుకు రావద్దు. మాకు సహాయకంగా సిద్ధమై ఉండండి. అవసరం అయితే ప్రాణాలకు తెగించి వాడి అంగరక్షకులను చంపేయండి!”.. మిత్రులను హెచ్చరించాడు.
ఓ సేనానిని ఎంచుకుని అశ్వంపై అతనికి ఎదురుగా వెళ్లాడు జాయప. అనుకోకుండా.. అప్పుడే జాయపను ఒకేసారి చూశారు గణపతిదేవుడు, పినచోడుడు.
‘అరె.. జాయప కదూ!’..
పృథ్వీశ్వరుని చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని ఛేదించడమే లక్ష్యంగా.. జాయప మెరుపులా కదులుతున్నాడు. అంతా యుద్ధ బీభత్సం.. తలలు తెగుతున్నాయ్.. కాళ్లు విరుగుతున్నాయ్.. మహారాజులను అంగరక్షకులు శత్రు ఆయుధాల నుంచి రక్షిస్తున్నారు. వాళ్లు తలపడి వీరోచితంగా పోరాడుతున్నారు..
ఝాము.. మరో ఝాము.. మూడో ఝాము. ఏనుగులు రెండు వలయాలుగా శత్రువులను చుట్టుముట్టినట్లు జాయప, సుబుద్ధి తప్ప మరెవ్వరూ గుర్తించలేదు. అప్పుడు జాయప కొమ్ముబూర నోట పట్టి
ఉధృతంగా మోగించాడు. ఆ శబ్దం ఏదో సూచికగా మోగింది. అంతే.. డబ్భు ఏనుగులు ఒక్కసారిగా పెద్దపెట్టున ఘీంకారం చేశాయి.
యుద్ధ క్షేత్రమంతా దద్దరిల్లింది. కంపించిపోయింది. కొందరు భయంతో వెర్రికేకలు వేశారు. ఏమైందో తెలియని శత్రుసేనలు భయంతో చిందరవందరయ్యాయి. ఏనుగులు శత్రువులను విచక్షణరహితంగా తొండాలతో పట్టి విసిరివెయ్యడం.. కాళ్లతో తొక్కడం.. మావటీలు జారవిడిచిన చిన్నఈటెలు పట్టుకుని గుర్రాల కాళ్లకు గురిపెట్టి విసరడం.. గుర్రాలు కిందపడి ఆశ్వికులను పడవేయడం. వెంటనే నాగంభట్టు, త్రిపుర, సుబుద్ధి కూడా ఆ ఆశ్వికులైన సేనానుల తలలను నరికివేయడం.. చకచకా జరిగిపోతున్నాయి. అంతా ముందే అభ్యాసం చేసినట్లు జరిగిపోతున్నది. ఏనుగులు ఘీంకారాలు ఆపడం లేదు. జాయప చెప్పేవరకు అవి ఆపవు.
యుద్ధభూమి.. ఉద్వేగ యుద్ధోన్మాదాలతో ఊగిపోతున్నది..
ముఖ్యంగా డబ్భు ఏనుగుల భీకర ఘీంకారం.. భూకంపాన్ని తలపిస్తున్నది. కొండలు కూలిపోతున్నాయేమో.. సముద్రం ఉప్పొంగి వచ్చి పడుతున్నదేమో.. అందరూ భీకరంగా యుద్ధం చేస్తున్నా, అందరిలోనూ భయప్రకంపనలు సృష్టిస్తున్నాయా గజ ఘీంకారాలు.. అంత రౌరవాది నరకప్రాయంగా ఉన్న యుద్ధభూమిలో తన యుద్ధతంత్రం సృష్టిస్తున్న ఉన్మత్త ప్రకంపనలను అతి జాగ్రత్తగా పరికిస్తున్నవాడు జాయప.. ఉన్నట్టుండి అరిచాడు. “కంటకా! నా తండ్రి పైకి వాడు.. వాడు!”..
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284