Jaya Senapati katha| జరిగిన కథ : ‘పృథ్వీశ్వరునిపై అంతిమయుద్ధం’ అనేసరికి కాకతీయ రాజ్యంలో వాతావరణం వేడెక్కింది. మహామేధావులైన యుద్ధ మంత్రాంగవేత్తలతో, మహావీరులైన సైన్యాధ్యక్షులతో అప్రతిహత విజయాలతో పురోగమిస్తున్న కాకతీయ సామ్రాజ్యం.. మరో చారిత్రాత్మక యుద్ధానికి సిద్ధం అవుతున్నది. అదే సమయంలో జాయప రూపకల్పన చేసిన ప్రేరణ నాట్యం.. రాజ్య ప్రజల్లో యుద్ధోత్తేజాన్ని మరింత పెంచింది. ఆ ఉద్వేగవేళ జాయపకో సందేహం.. ‘ఈ యుద్ధంలో నా పాత్ర ఏమిటి?’ అని!
అదే ప్రశ్న జాయప అడిగినప్పుడు.. జవాబు ఇవ్వడానికి మిత్రబృందం కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నది. “ఇప్పటికే ప్రేరణ నాట్యం ద్వారా నువ్వు యుద్ధానికి ఎంతో ప్రేరణ కలిగించావు. నిన్ను ఎంపికచేసిన గణపతి దేవులవారి నమ్మకాన్ని నిలబెట్టావని రాజవర్గాలు చెప్పుకొంటున్నాయి. సైన్యం బయల్దేరేవరకు ఓ నాట్యకారుడిగా మరింత సహకారం అందించు జాయపా! సైన్యం గెలుపులో నీ పాత్రను కాకతీయ రాజ్యం ఎప్పటికీ మరచిపోదు”.. అన్నాడు శుక్ర.
కానీ, శుక్ర సలహాతో నాగంభట్టు, త్రిపుర సమాధానపడలేదు.
“అద్భుతమైన యుద్ధవీరుడివి. తప్పకుండా యుద్ధభూమిలో ఉండాలి నువ్వు”..
వాళ్లిద్దరూ కూడా యుద్ధరంగంలో ప్రవేశించి కత్తి తిప్పడానికి సిద్ధమై ఉన్నారు.
“కత్తి దుయ్యి. శత్రువుల పీకలు కూరలు తరిగినట్లు తరగడమే నీకు శివాజ్ఞ!” అన్నాడు భైరవ.
“యుద్ధం నీ రకతంలో ఉంది. రాజ్జవంతా యుద్ధ జొరంతో యేడెక్కిపోతావుంటే.. నువ్వు కాళ్లు ముడుచుకు కూసుంటే ఎట్టా సిన్నదేవరా!? ఏనుగెక్కి కత్తి దుయ్యాల్సిందే..” అన్నాడు కంటక దొర.
జాయప కోరుకుంటున్నది కూడా అదే. తన ప్రధాన ఆశయం అక్కలను బంధవిముక్తులను చేయడం. అక్కల భవిష్యత్తు ఈ యుద్ధంపై ఆధారపడి ఉంటుందని గతంలో చౌండసేనాని చెప్పింది జాయపలో నిత్య జ్ఞాపకం!
చౌండసేనానిని కలిశాడు. చాలా ఉద్రిక్తంగా, ఏమాత్రం మాట్లాడలేనంత యుద్ధమంత్రాంగంలో నిమగ్నమై ఉన్నాడాయన. ఆయన కార్యాలయం కొండిపర్తి మండల మంత్రులతో, సేనానులతో ఇతర ప్రముఖులతో చాలా హడావుడిగా ఉంది.
“నన్నేం చెయ్యమంటారు బాబయగారు??” అన్నాడు వినయంగా.
జాయప అడిగిన ప్రశ్నతో ఖంగుతిన్నాడు చౌండ. జాయప పినచోడుని కుమారుడు. అంటే ద్వీప యువరాజు. ఈ యుద్ధానికి ముఖస్థానంలో ఉండబోతున్నది పినచోడుడే. అనుమకొండవాసిగా, నాట్యకళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న జాయప.. ఏ స్థానంలో యుద్ధరంగంలోకి ప్రవేశించగలడు?
జాయప యుద్ధశిక్షణశాలలో ఉధృతంగా శిక్షణ పొందుతున్నట్లు వేగులు చెప్పారు.
చక్రవర్తులవారు తననే సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని సేనానులంతా భావిస్తున్నారు. ఒకవేళ తనే సర్వసైన్యాధ్యక్షుడు అయితే.. తన ఆధ్వర్యంలోనే జాయప ఉంటాడు. సరే.. జాయప పినచోడుని కుమారుడని పృథ్వీశ్వరుడి సైన్యానికి తెలిస్తే?!
అబ్బో.. ఇదేదో చిన్నవిషయం కాదు. తను నిర్ణయించేకన్నా చక్రవర్తి వద్దకు పంపితే సరి!
“ఆ.. జాయపా! కొత్తనాట్యం ద్వారా ప్రజలను యుద్ధంపట్ల సానుకూలం చేశావని చక్రవర్తి నిన్ను దినమూ స్మరించుకుంటున్నారు. ఆయన్నే కలిసి అనుజ్ఞ తీసుకుంటే సమంజసం కదా..” అన్నాడు నర్మగర్భంగా.
మిత్రబృందం కూడా ప్రోత్సహించారు.
“నీకు చక్రవర్తులవారు ఆనందంగా అనుజ్ఞ ఇస్తారు” అన్నారు.
నీలాంబతో కూడా చర్చించాడు.
“నా అభిప్రాయంలో నువ్వు దైవదత్తమైన కళాకారుడివి. యుద్ధాలు వదిలి నాట్యంమీదే నీ శక్తియుక్తులు కేంద్రీకరించు. తరతరాలు చెప్పుకొనే మహా
కళాకారుడిగా చరిత్రలో నిలిచిపోతావు..” అన్నదామె.
ఈ సలహా జాయపకు రుచించలేదు.
గత అనుభవాలు గుర్తు తెచ్చుకున్నాడు. తనలో ఉన్న క్షత్రియత్వం, అక్కల జీవితం పట్ల తల్లిదండ్రుల మౌనరోదన, భాండయ ఉదంతం, కంటక వాఖ్యలు, నాగంభట్టు, త్రిపుర కూడా యుద్ధ సన్నద్ధులవడం, గత ఏడేళ్లుగా తన అనామక జీవితం, అనుభవాలు.. అన్నీ కళ్లముందు కదలాడాయి. తీవ్రంగా నాలుగైదురోజులు యోచించిన మీదట.. జాయప ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ యుద్ధం తన కుటుంబపు తలరాతను మార్చబోతున్నది. తను తప్పనిసరిగా యుద్ధభూమిలో తన శక్తియుక్తులు ప్రదర్శించాలి. తప్పదు!!
తను చక్రవర్తి అనుమతితో యుద్ధంలో పాల్గొనడమే మంచి మార్గం! ఆయన తప్పక అనుమతి ఇస్తారు. సాధారణంగా ఏ పౌరుడైనా యుద్ధరంగానికి వస్తానంటే.. సేనానులు ఎగిరి గంతేసి అంగీకరిస్తారు. చాతావాతా కానివాడైనా యుద్ధోన్మాదంతో సిద్ధమైతే.. ఆహ్వానించి ఎక్కడో ఒకచోట చోటు కల్పిస్తారు. వాడు చస్తే మాత్రం ఏమిటి? యుద్ధమంటేనే చావడం. మనవాడో.. ఎదుటివాడో! కాబట్టి ఇలాంటి అమాయకులను శత్రువు అహం చల్లార్చేందుకు ఎరగా వేస్తారు. శత్రువు ఒకణ్ని చంపినట్లు గర్విస్తాడు. వాడా ఆనందంలో ఉండగానే.. శత్రు యోధుడు వాణ్ని చంపేస్తాడు. ఇది యుద్ధ క్రీడ. ప్రాణాలతో చెలగాటం. తెగిన తలల లెక్కలు మాత్రమే ముఖ్యం!
చక్రవర్తిని ఎలా కలవడం??
యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న జాయప.. చక్రవర్తిని కలిసే మార్గం ఆలోచిస్తున్నాడు. గురుదేవుడు గుండయామాత్యుని ద్వారా చక్రవర్తిని కలుద్దామని భావించాడు. నీలాంబ ద్వారా వెళ్లమన్నారు మిత్రులు.
ఇష్టం లేకపోయినా జాయప కోరిక కాదనలేక నీలాంబ అంగీకరించింది.
సాధారణంగా చక్రవర్తిని వ్యక్తిగతంగా కలవాలంటే నగరి – అధికారి అంగీకారం ఉండాలి. అలాగే ఆయా వ్యక్తుల రంగాలకు సంబంధించిన నియోగాధిపతుల అనుమతి కూడా కావాలి. ఇక్కడ నీలాంబలాంటి ప్రత్యేక వ్యక్తులకు అధికార గణం అనుమతి వెంటనే ఇస్తుంది. కానీ, చక్రవర్తి అంగీకరించాలి.
“నాతోపాటు నాట్యకారుడు జాయప కూడా తమరి దర్శనం కోసం వేచి ఉన్నాడని చెప్పండి!”.. నీలాంబ కోరింది.
నిజంగానే చక్రవర్తి నుంచి అనుమతి వెంటనే లభించింది. మరో ఐదు ఘడియల తర్వాత వారికి లోపలికి అనుమతి దొరికింది.
“రెండు ఘడియలు మాత్రమే చక్రవర్తి కేటాయించారు. తెలుసుగా.. యుద్ధ చర్చలు!”
ఘడియ తర్వాత ఇద్దరూ చక్రవర్తి ముందున్నారు.
ఆయనను చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. గణపతిదేవుడు అలంకారం తొలగించిన దేవుడిలా ఉన్నాడు.
సభకు హాజరయ్యే రూపంలో కాకుండా చాలా సాధారణ ఆహార్యంతో చర్చల మధ్య ఉండటంవల్ల కాబోలు.. చాలా అప్రసన్నంగా కనిపించాడు ఇద్దరికీ.
ఇద్దరినీ చూసి ఆయన భ్రుకుటి ముడిపడింది.
“నీలాంబా! ఏమిటి ఈ సమావేశ కారణం?” అన్నాడాయన ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే.
గొంతులో కరుకుదనం లేకపోయినా మార్దవం లేదు. ఆమె మరోమారు వంగి నమస్కరించి..
“జాయప.. జాయప తమరికి ఏదో విన్నవించుకోవాలని..” అర్ధోక్తిలో ఆపింది.
ఆయన మరింత ఆశ్చర్యపోయాడు. కళ్లు చికిలించి జాయప వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
“ఏమి జాయపా! మీ కొత్త నాట్య ప్రదర్శనలపై ప్రజలంతా ముగ్ధులవుతున్నారని వార్తలు వింటున్నాం. భేష్.. మీ నాట్యవృత్తిని మరింత ఉధృతం చెయ్యండి..” అన్నాడు.
అసహనం.. ఆయన మోములో, మాటల్లో ద్యోతకమవుతున్నది. ముక్తసరిగా మాట్లాడుతున్నాడు. సమావేశం ముగించడానికి వేగిర పడుతున్నాడు. ఇది గమనించని జాయప తన ధోరణిలో అన్నాడు.
“మహాప్రభూ! నేను.. నేను యుద్ధ సంసిద్ధుడనై ఉన్నాను. కత్తి తిప్పగలను. రథమారోహించి విల్లు ఎక్కుపెట్టగలను. దయచేసి నన్ను యుద్ధంలో పాల్గొనడానికి అనుమతించాల్సిందిగా..”
వాక్యం పూర్తికాకుండానే ఆపమన్నట్లు హస్తం పైకి ఎత్తాడు చక్రవర్తి. ఆయన ముఖం అరుణారుణమైంది.
నాసికారంధ్రాల నుంచి వెలువడుతున్న వెచ్చని ఆవిరులతో కళ్లు మరింత ఎరుపెక్కాయి.
“ఏమి.. ఏమి నీ వాచాలత్వం?! నువ్వేమిటి.. యుద్ధానికి సిద్ధమవ్వడం ఏమిటి. పైగా మా అనుమతి కోరుతున్నావా!? అదేమన్నా రంగస్థలమా.. అదేమన్నా రాజనగరా.. ఇక్కడ ఆహార్యం మార్చుకోవడానికి ఉన్నట్లు ఆయుధం మార్చుకోవడానికి ప్రత్యేకమందిరం ఉండదు. యుద్ధం అంటే సంగీత గీతాలమధ్య నర్తించడంకాదు. పో.. పోయి నాట్యాభ్యాసం చేసుకో! ఏమి నీలాంబా.. ఏమి ఈ కుర్రవాడి అతివేషాలు. నువ్వయినా చెప్పవచ్చు కదా. పైగా సరాసరి మా వద్దకే వచ్చి మమ్మల్నే అనుమతి అడగడం. ఇది ఇచ్చిన గౌరవాన్ని అపహాస్యం చేయడమే!”..
ఆయన కోపాగ్ని ప్రభావం పక్క మందిరంలో చర్చిస్తున్న మంత్రుల సమావేశంపై పడింది. వారంతా బిలబిలా బయటికి వచ్చారు. ప్రధానమంత్రి గంగాధరుడు వేగంగా స్పందించి మధ్యకొచ్చాడు.
“నీలాంబా! ఆ కుర్రవాణ్ని తీసుకుని ముందు ఇక్కడినుంచి నిష్క్రమించు..” తొందర పెట్టాడాయన. మరో మాట మాట్లాడనివ్వలేదు. ఈలోగా ఇతర మంత్రులు చక్రవర్తిలో ప్రసన్నత కల్పిస్తూ లోపలికి తీసుకుపోయారు.
మౌనంగా నిష్క్రమించారు నీలాంబ, జాయప.
మరి రెండురోజులు స్తబ్ధంగా ఉండిపోయాడు జాయప.
అవమానం. ఘోర అవమానం! చక్రవర్తుల వద్ద పెంపొందించుకున్న మంచి గుర్తింపు ఒక్క సంఘటనతో పూర్తిగా దగ్ధమై పోయింది. ఏడేళ్లుగా ఇక్కడ పరాయివాడు కాని పరాయివాడుగా జీవిస్తూ.. ఒక్కొక్క రాయీ పేర్చుకుంటూ కట్టుకున్న గౌరవమనే గాజుమేడను ఒక్క చిన్న తప్పటడుగుతో కూలదోసుకున్నాడు.
పరమపద సోపానపటంలో సర్పాలను తప్పుకొంటూ.. నిచ్చెనలు దొరకకున్నా ఒక్కొక్క గడి దాటుతూ.. సాక్షాత్తూ చక్రవర్తి ప్రేమను సంపాదించుకున్నాడు. ఆయన ప్రకటించిన నమ్మకాన్ని ప్రేరణ నాట్యం ద్వారా నిలబెట్టుకున్నాడు. కానీ.. కానీ యుద్ధ ప్రవేశానికి అనుమతి అడగడం మొదలంటా నాశనం చేసింది.
ఈ యుద్ధం.. తనకు చావో బతుకో తేల్చేసే అంశం. కానీ, ప్రవేశమే దొరకలేదు.
విశేష శక్తులున్న సహజమేధావి అయిన జాయప.. ఇది తన అతిపెద్ద విఫలయత్నంగానూ, ఓటమిగానూ భావించాడు. లోలోన కుమిలిపోతూ మౌనంగా ఉండిపోయాడు. కంటక నివాసంలో ఒంటరిగా మిగిలిపోయాడు. మిత్రబృందాన్ని కూడా కలవడం లేదు. మిత్రులే అతని వద్దకు వచ్చారు. అవమానభారంతో వాళ్లతో హాయిగా ప్రవర్తించలేక పోయాడు. జాయపను ఎప్పుడూ అలా చూడని మిత్రులు ఖంగుతిన్నారు. సాధ్యమైనంతగా ఊరడించారు. అయినా జాయప మామూలు మనిషి కాలేదు.
రానురానూ యుద్ధ ప్రయత్నాలు పెరిగిపోయాయి. మూలసైన్యాలు, మిత్రసైన్యాలు, గిరిజన సైన్యాలు, భృత్య సైన్యాలు.. కలగలిపి సైనిక దళాలుగా పటాలం అంతా సిద్ధమైపోతున్నది.
రాజవార్త సంబంధి యుద్ధ వార్తలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నాడు. యుద్ధానికి సర్వసైన్యాధ్యక్షుడుగా ఈ పర్యాయం కూడా మల్యాలచౌండను నియమించాడు చక్రవర్తి. రాజధాని నుంచి యుద్ధాన్ని సమన్వయం చేసేది రేచర్ల రుద్రసేనాని, చెరుకు బ్రహ్మిరెడ్డి సేనాని.
“చౌండుడే గతంలో కూడా వెలనాడుపై యుద్ధానికి నాయకత్వం వహించాడు. శత్రుశేషం పూర్తిగా తుడిచి పెట్టాల్సినవాడు చౌండసేనానే కదా..”
“పెద్దాయన రుద్రసేనానితోపాటు యువకుడైన చెరుకు బ్రహ్మిరెడ్డికి యుద్ధ సమన్వయం ఇవ్వడం భేష్.. భేష్..”
కాకతీయ రాజ్యమంతటా.. ప్రతి పౌరుడూ, పిల్లా జెల్లా, గొడ్డూగోదా.. సమస్తమూ యుద్ధ జ్వరంతో ఊగిపోతున్నది.
జాయప మాత్రం ఒంటరిగా.. దీనంగా ఓ గదిలో!
యుద్ధానికి బయల్దేరే ముహూర్తం వార్త ప్రకటించింది రాజనగరు.
“శుక్లపక్షం శుద్ధదశమి గురువారం శుభదినాన తెల్లవార తొలిఝామునే కాకతీయ మహా సైన్యదళాలు పిష్టపుర రాజ్యంపై ప్రకటించిన యుద్ధానికి కదలబోతున్నదహో.. శ్రీశ్రీశ్రీ గణపతిదేవులు స్వయంగా ఈ చారిత్రాత్మక యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారహో..”
కాకతీయరాజ్యం ఉద్వేగంతో ఊగిపోయింది. సాక్షాత్తూ చక్రవర్తి యుద్ధానికి కదలడం ప్రజల్లో ఆయనపట్ల అనుకూలభావన హిమవన్నగమంతగా ఎగసింది.
“ఇదీ చక్రవర్తి దెబ్బంటే!”..
(సశేషం)
పరమపద సోపానపటంలో సర్పాలను తప్పుకొంటూ.. నిచ్చెనలు దొరకకున్నా ఒక్కొక్క గడి దాటుతూ.. సాక్షాత్తూ చక్రవర్తి ప్రేమను సంపాదించుకున్నాడు. ఆయన ప్రకటించిన నమ్మకాన్ని ప్రేరణ నాట్యం ద్వారా నిలబెట్టుకున్నాడు. కానీ.. కానీ యుద్ధ ప్రవేశానికి అనుమతి అడగడం మొదలంటా నాశనం చేసింది. ఈ యుద్ధం.. తనకు చావో బతుకో తేల్చేసే అంశం. కానీ, ప్రవేశమే దొరకలేదు.
– మత్తి భానుమూర్తి 99893 71284