చారిత్రక కాల్పనిక నవల
62 ధారావాహిక
జరిగిన కథ : కొత్త పాటలు, నాట్యాలు, వాయిద్యాల గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతాడు జాయపుడు. ఓ మహిళ..
జానపదాలను అద్భుతంగా ఆలపిస్తుందని ఎవరో చెప్పాడు. దాంతో ఆమెను వెతుక్కుంటూ.. పల్లె బాట పట్టాడు జాయప. దాదాపు సంధ్య కావస్తుండగా.. ఓ గ్రామానికి దగ్గరగా చేరుకున్నాడు. దారిలో ఎదురైన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో.. మరింత ముందుకు సాగాడు. అప్పుడేఓ ఉచ్ఛస్వరం వినిపించింది. అది వినిపించిన వైపుగా.. దూరంగా ఒక గుడిసె కనిపించింది.
సాంఖియ నివాసం..
అప్పుడే ఓ వ్యక్తి గుడిసె వెనుకనుంచి విసురుగా వచ్చి.. తలుపులాంటి తడికెను వేగంగా ఓ తన్ను తన్నాడు. మరింత చురుగ్గా లోపలికి పోయి ఓ మహిళను జుత్తుపట్టి బయటికి ఈడ్చుకు వచ్చాడు. ఆమె వచ్చి వచ్చి దూరంగా పడింది. వీపుపై ధబీ ధబీమని రెండు తన్నాడు.
ఆమె భరిస్తున్నట్లు.. అలవాటైనట్లు.. అలాగే ఉంది. అతను మళ్లీ కాలెత్తాడు. ఆమె తలెత్తి గట్టిగా..
“అమ్మోరూ దండాలమ్మో.. హయ్యలో దండాలమ్మో!” అన్నది.
కళ.. ధిక్కారానికి గొంతునిస్తుంది.. ఎప్పుడూ. జాయపుడి చేయి అలవోకగా మీసం మీదికి వెళ్లింది. బహుశా పక్కింటామె కావచ్చు.. అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. అతనితో ఏదో వాగ్యుద్ధం.. తను రాకూడని సమయంలో వచ్చానేమోననే శంక జాయపునికి కలిగింది.
తానిప్పుడు ముందుకు వెళ్తే?.. వెళ్లకుంటే??..
ఊహించకుండా అప్పుడే గుర్రాల గుంపు కదలిక వెనగ్గా వినిపించి.. దుమ్ము పైకి లేచింది. జాయపుడు తలతిప్పి చూసేసరికే ఓ మహిళల బృందం గుర్రాలపై వేగంగా వచ్చింది. అక్కడికే వెళ్లి ఆగింది.
ఇంటివద్ద వారు నిర్ఘాంతపోగా ఆవలగా జాయపుడు కూడా సంభ్రమంతో చూస్తుండిపోయాడు.
ఆ మహిళల నాయకురాలు కాబోలు.. వేగంగా గుర్రందిగి విసురుగావెళ్లి ఆ గాయనిని పట్టి లేపింది. ఆమె భర్త సాంఖియ కంచుకం పట్టి అంతే వేగంగా రెండు చెంపలూ వాయించింది. పక్కింటామె ఆనందంగా చూస్తున్నది. ఆగంతక మహిళలు కొందరు ఆమె దగ్గరికి వెళ్లగా.. కొందరు సాంఖియ పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు.
బిలబిలమంటూ కొంతమంది గ్రామస్తులు తలోవైపు నుంచి పరుగున అక్కడికి వచ్చారు.
వారిలో ఓ పెద్దమనిషి.. గ్రామరట్ట కాబోలు ముందుకు వచ్చాడు.
“ఇది రోజూ ఉండే బాగోతమే! తమరెవురమ్మా?” అని అడిగాడు.
ఆమె ఏమీ చెప్పకుండానే సాంఖియ జుట్టు పట్టుకుంది.
“ఎందుకు ఆమెను కొడుతున్నావ్??” అని గద్దించింది.
“అది నా పెళ్లాం.. కొట్టుకుంటా.. తిట్టుకుంటా.. నీకెందుకు?” అన్నాడు సాంఖియ.. అదే క్రౌర్యంతో.
మళ్లీ నాలుగు అంటించింది. ఆమె వెంట వచ్చినవారు అతణ్ని చావబాదారు. అతణ్ని వదిలి.. ఆ జానపద గాయనిని ఒకరు తన గుర్రంపై కూర్చోబెట్టుకున్నారు. గుర్రాలు వెనుదిరిగాయి.
నాయకురాలు అన్నది జనాంతికంగా..
“లచ్చుమ పాటలు పాడటం ఈ మొగుడుగాడికి ఇష్టం లేదట. ఆమె మాకు సమాచారమిచ్చింది. మేం ఆమెను మంచి గాయకురాలిగా చేసి రాజాస్థానంలో పాడేలా శిక్షణ ఇప్పిస్తాం. ఇలా భర్తలు కొట్టి తిట్టే కళాకారులు ఉంటే మాకు తెలియబరచండి!”.
కళ్లెం పట్టి మోకాళ్లతో గుర్రాన్ని సున్నితంగా కదిపింది.
గ్రామస్తులు కూడా తలోమాటా అనుకుంటూ అంతా కదిలారు. జాయపుడు దూరంగానే నిలబడిపోయాడు.
వెళ్తున్న నాయకురాలు జాయపుణ్ని చూసింది. ఆశ్చర్యపోయి గుర్రాన్ని బలంగా ఆపింది. వేగంగా దిగింది.
“అరే.. జాయ మామా! నువ్వా.. నువ్వేమిటి ఇక్కడ??”.
అప్పుడు చూశాడు.
ఆమె నీలాంబ కుమార్తె.. లలితాంబ!!
తెల్లబోయాడు. ఇదేవిటి.. ఈ పల్లెటూరికి ఈ పిల్ల పదిమందిని వెంటేసుకుని వచ్చి ఓ గాయనిని భర్త హింస నుంచి కాపాడి తీసుకుపోతున్నది.. భలే! మరెవరో..
ఆఖరికి నీలాంబక్క చెప్పినా తను నమ్మేవాడు కాదు. కానీ కళ్లముందే జరిగింది. ఆమె బృందాన్ని వెళ్లమని చెప్పి జాయపుని వద్ద ఆగిపోయింది. జాయపుడు కూడా గుర్రం దిగాడు. అతని ముఖంలో తేజరిల్లుతున్న విభ్రమం ఆమె గుర్తించినట్లు నవ్వింది.
“ఇదేవిటి.. ఈ వేశ్యాంగనలు మందిరాలలో నాట్యాలు చెయ్యాలే గానీ, ఇలా గుర్రాలపై వచ్చి మొగుళ్లను కొట్టి పెళ్లాలను రక్షించడం ఏవిటి అనుకుంటున్నావా జాయ మామా!?”.
నిజమే.. అదే అనుకుంటున్నాడు జాయపుడు. ఆమె మాటలకు ఏం చెప్పాలో వెంటనే తోచలేదు.
ఇద్దరూ గుర్రాల కళ్లాలను పట్టుకుని నడుస్తున్నారు. చీకట్లు ముసురుకున్నాయి. గాలి ఇద్దరి మధ్య లేగదూడలా చుట్టుకుంటూ గంతులు వేస్తున్నది.
“అమ్మ.. అదే అక్క కూడా..” అన్నాడు ఏమనాలో తోచడంలేదు.
ఎనిమిదేళ్లుగా నీలాంబపై ఉన్న అభిప్రాయం వేరు. ఇప్పుడు ఈ కూతురు ఏవిటి.. ఇలా మగ
యోధురాలిలా!?
నవ్వింది లలితాంబ.
“నేను కాబట్టి వాణ్ని వదిలేశాను. మీ అక్క అయితే వాణ్ని ఇక్కడే నరికేసేది”.
బిర్ర బిగదీసుకుపోయాడు. ఆగిపోయాడు.
“పద పద.. వెళ్లి మీ అక్కతోనే మాట్లాడు మామా!”.. అల్లరిగా నవ్వి అశ్వాన్ని అధిరోహించింది.
ఆమె వేగంగా దూసుకుపోగా రేగిన దుమ్ము జాయపుణ్ని చుట్టేసింది. మరో రెండు ఘడియలు అక్కడే ఉండిపోయాడు.
ఏమీ అర్థంకాలేదు. విక్రమ చిరాగ్గా కదలాడుతుతున్నది. అధిరోహించగా.. వేగంగా కదిలింది.
వేశ్యావ్యవస్థ సమాజంలోని గౌరవప్రద వ్యవస్థల్లో ఒకటి. భరతఖండంలోనే అత్యుత్తమ రాజ్యాలుగా దక్షిణాపథంలోని ఆంధ్ర రాజ్యాలు, దక్షిణావర్తంలోని పాండ్య, చోళ, చేర, హొయసల తదితర రాజ్యాలు వెలుగొందుతుండగా.. కాకతీయ రాజ్యంలోని ఎన్నో నగరాలు, పురాలు, పట్టణాలు భోగభాగ్యాలతో తులతూగుతున్న కాలం. కాబట్టి ఇక్కడ కూడా వేశ్యావ్యవస్థ కళకళలాడుతున్నది.
వేశ్యావ్యవస్థకు సమాజంలో ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఇది కళలకు, కళాకారులకు కేంద్రం. కళా ప్రేమికులు, కళా పోషకులు అయిన సమస్త కులీనులు సేదదీరే ప్రాంగణం. కవి గాయక చిత్రకార, నాట్యవర్గాలు..
తదితర కళాకారుల, కళాపోషకుల సంగమ కూడలి.
రెండోపార్శ్వం ఏమిటంటే.. భార్యలా కాకుండా మరోస్త్రీతో శృంగారం పంచుకోవడానికి అధికారికప్రకటిత స్థలం.
ఆరుగురు భార్యలున్న వైణిక విద్వాంసుడు కేళికభట్టు ప్రతి సాయంత్రమూ వేశ్యాగృహంలో సేదదీరాల్సిందే! అక్కడ ఆయనకొక ఉంపుడుగత్తె ఉన్నది. ఆమె బాగోగులు వేశ్యానిలయ నిర్వాహకురాలు చూసుకుంటుంది. ఈయనగారు ఆయనకు విశ్రాంతి కావాల్సినప్పుడల్లా అక్కడికి విచ్చేస్తాడు. అక్కడున్న మిత్రాదులతో ముచ్చట్లు, మధుసేవనం అయ్యాక.. అతని ఉంపుడుగత్తెతో సరససల్లాపాలు జరిపి, ఆ రాత్రి అక్కడే ఆమెతో గడిపి.. తెలతెల్లవారుతుండగా తన గృహానికి వెళ్తాడు. అతని ఉంపుడుగత్తె నిర్వహణార్థం వేశ్యాగృహ నిర్వాహకురాలు నిర్ణయించిన పైకం తృణప్రాయంగా చెల్లిస్తాడు.
అలా ఈ వ్యవస్థ ఓ చెడు సంప్రదాయంలా కాకుండా.. కులీనుల, ధనవంతుల విలాస జీవితానికి జ్ఞాపికలా వెలిగిపోతున్నది.
మానవులు గుంపులుగా, తర్వాత గణాలుగా, తర్వాత జనపదాలుగా, అనంతరం రాజ్యాలుగా సమీకృతమవుతున్న అనాదికాలంలో.. యుద్ధాలే యుద్ధాలు. రాజులు గెలిచారు.. ఓడారు.. అనేదే చూస్తున్నారు గానీ, చనిపోయిన సైనిక కుటుంబాల భవిష్యత్తు ఏమిటి? విధవలైన ఆయా భార్యల.. అనాథలైన పిల్లల బాగోగులు పట్టించుకునేవారు ఎవ్వరు? అంటే ఎవ్వరూ లేరు.. ఉండరు. తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అత్తమామలకు భారమైన విధవస్త్రీలు మౌనంగా చేరేది ఈ వేశ్యాగృహాలకే.
అలా అలా మంచి నిర్వహణా సామర్థ్యంగల అనాథస్త్రీలు వీటినొక ధనవంతుల విలాసకేంద్రాలుగా రూపుదిద్దారు. కేవలం వేశ్యావృత్తి అంటే గౌరవం ఉండదు కాబట్టి.. కళాకారులైన మహిళలను కూడా చేర్చుకుని కళాకేంద్రాలుగా ఏర్పరచారు. ఇప్పుడివి రాజ్యానికి పన్నులు చెల్లించే స్థాయికి ఎదిగాయి. కాబట్టి మహారాజులు, వారి అధికారవర్గాలు కూడా ఈ వేశ్యానిలయాలకు గౌరవ స్థానం కల్పించాయి.
ఇప్పుడవి మగవారి దౌష్ట్యానికి, సామాజిక దుర్మార్గాలకు నష్టపోయిన మహిళలకు ఓదార్పు కేంద్రాలు కూడా అయ్యాయి. భర్త, వివాహవ్యవస్థ లేదా అనేకానేక సంప్రదాయాలనే సంకెళ్లలో మగ్గుతున్న స్త్రీలు.. వారంతట వారు బయటికి రాదలిస్తే, వారికి స్వాగతం పలుకుతున్నాయి ఈ వేశ్యాగృహాలు.
ప్రతి మానవసమస్యకూ కాలగతి ఓ పరిష్కార వ్యవస్థను సృష్టిస్తుంది. అలాంటి వ్యవస్థలో మహిళలకు ఆపన్నహస్తం అందిస్తున్న వేశ్యాగృహం నీలాంబది. ఆమెలోని ఈ మరోకోణం జాయపునికి తెలియదు. పసితనపు ఎలప్రాయాన ఆమె జాయపునికి ఓ నాట్యకత్తెగా పరిచయం అయ్యింది. ఆమెను ‘అక్కా!’ అని అనాలోచితంగానే పిలిచాడు. ఆమె వేశ్యాగృహం తనకు తెలిసిన రాజభవనంలా ఉండటంతో ఆమెతో సౌఖ్యంగా ఉన్నాడు. కానీ, ఆమె గురించి ఎక్కువగా ఆలోచించగల వయస్సు అప్పుడు లేదు. ఇప్పుడు ఆ గ్రామంలో ఓ జానపద గాయకురాలిని వీరోచితంగా లలితాంబ రక్షించడంతో.. నీలాంబలో మరోకోణం ఉన్నదన్న వాస్తవం తెలిసివచ్చింది.
మరునాడు జాయపుడు నీలాంబ వేశ్యాగృహానికి వెళ్లాడు. ఎదురొచ్చి అక్కున జేర్చుకుని ఆహ్వానించింది నీలాంబ. ఎప్పటిలాగే జాయపుణ్ని ప్రాణప్రదంగా.. కళ్లలో తొణికిసలాడే అనురాగంతో చూసింది. ముఖ్యంగా అతనిలోని అబ్బురపరచే కళాత్మకత, వీరత్వం.. తోడబుట్టినవానిలా ‘అక్కా! అని పిలిచే సహజమైన ఆత్మీయవాక్కు ఆమె గుండెల్లో నిలిచిపోయాయి.
ఓ వేశ్యను ఓ రాచకుటుంబీకుడు ‘అక్కా!’ అని పిలవడం ప్రస్తుతకాలంలో అసంభవం. నీలాంబలాంటి వారికి.. అలాంటి ఆత్మీయత ఎన్ని బంగారురాశులు పోసినా దొరకవు. అది ఆమెకు తెలుసు.
జాయపుని చేయిపట్టి పక్కనున్న ఆసనంపై కూర్చోబెట్టింది. అతనిలో అదే స్వచ్ఛత.. కానీ, ఇవ్వాళ కొంచెం పరిశీలన ఎక్కువైంది. అ మందిరమంతా పరిశీలనగా చూస్తున్నాడు.
“క్షమించు జాయపా! రేపు నువ్వొచ్చేసరికి మరింత ఉచితాసనం.. అద్భుతమైన పర్యంకం నీకోసం సిద్ధం చేయిస్తాను” అన్నది ఉత్సాహంగా.
చటుక్కున లేచి ఆమె పాదాలవద్ద కూర్చున్నాడు. ఆమె గందరగోళమై లేచి..
“అయ్యయ్యో.. ఏవిటి నువ్వు చేస్తున్నపని?” అన్నది.
“నువ్వు నా పెద్దక్కవు.. నేను నీ తమ్ముణ్ని. నువ్వు నా గురువ్వి.. నేను నీ శిష్యుడను. నాకోసం ప్రత్యేక పర్యంకం ఏవిటి? నన్ను నీ నుంచి దూరంచేసే అలాంటి భావనలు రానివ్వొద్దు.. నాకు నచ్చదు!”.
లేచి తిరిగి ఆసనం అలంకరించాడు.
జాయపుడిలాంటి ఓ అపురూపమనీషి అలా అనడం.. ఎవరికైనా నమ్మశక్యం కానిది. నీలాంబ మురిసి ముక్కలయ్యింది. ఆనందంతో కదిలి..
“నీకు భక్ష్యాలు ఏర్పాటుచేస్తాను ఉండు..” అంటూ లోపలికి వెళ్లింది.
లేచి ఆ మందిరాన్ని, పక్క మందిరాలను పరిశీలనగా చూడసాగాడు.
జాయపుడు ఎప్పుడూ నీలాంబ వేశ్యావాటికను పరిశీలనగా చూడలేదు. ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే.. వాటిక ప్రధానద్వారం ఒక్కటే కానీ, కార్యకలాప మందిరాలు వేరు, నివాసమందిరం వేరు. అది ఆ ప్రాంగణంలోనే వేరుగా ఉంది. అందులో మొదటి అంతర్వు ఉంది. ఆమె ప్రధానవృత్తి జీవితానికి.. వ్యక్తిగత జీవితానికి మధ్య నిర్దిష్టమైన దూరం ఉంది.
ఈ నివాసమందిరం అందులోనే ఉన్నా.. ఆమె ప్రధాన జీవనవ్యవహారానికి ఆవలగా ఉండటం జాయపుణ్ని నిర్ఘాంతపరిచింది. గతంలో తానిక్కడే నివసించాడు. ఇక్కడే నాట్యాల అభ్యాసం జరిగేది. కళాకారులంతా ఇక్కడే సందడి సందడిగా ఉండేవారు. చాలామంది పరిచారికలు, పనివాళ్లు, సహాయకులు కూడా ఉండేవారు. ఇక్కడ వారంతా లేరే?!
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284