జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. అంతలోనే యాదరుషి పాత్ర ప్రవేశిస్తుంది. యాదర్షి తపస్సు, నారసింహావతార ఆవిర్భావం గురించి త్రిభువన మల్లుడికి వివరిస్తాడు విజ్ఞానేశ్వరుడు .
తపస్సు చేయడానికి ఎన్నెన్నో పరీక్షలు, అడ్డంకులు ఎదుర్కొన్న యాదరుషి, ఈ బ్రహ్మ రాక్షసుడిని చూసి ఏ మాత్రం భయపడలేదు. యాదరుషి ధైర్యం ఆ నరసింహుడే! అందుకే తత్తరపాటు పడలేదు. బిత్తర చూపులు చూడలేదు.
“ఎక్కడ నీ దేవుడు?” అనడిగిన రాక్షస చక్రవర్తినే రంపాల్లాంటి గోళ్లతో చీల్చి వేసినవాడు నరసింహుడు. స్వామివారిని నమ్ముకొంటే రాక్షస బాధలు, గ్రహ పీడలూ ఉండవు. అపజయాలు బాధించవు. వాక్శుద్ధి కలుగుతుంది. తలచినది జరుగుతుంది.
కనులు మూసుకొని శ్రీ లక్ష్మి నృసింహుని స్తుతించాడు యాదరుషి.
జయ జయ శ్రీ నారసింహా! మహాదివ్యతేజా!
అనంతాదిత్య దివ్య స్వరూపా!
పరంజ్యోతి.. పరమాత్మ.. పరబ్రహ్మ పరానంద!
పరాకాశ ప్రకాశ!
అచ్యుతానంద, గోవింద! సర్వలోకాధీశ!
దేవాధిదేవ దేవ.. వాసుదేవ!
పరమయోగి వాఙ్మనసాపరిచ్ఛేద్య స్వరూప స్వభావ!
నిత్య నిరవద్య.. నిరతిశయః శ్రీ వైకుంఠనాథ!
రాక్షసాధములను నిర్మూలించడానికి సాక్షాత్తూ నరసింహుడే దిగిరానక్కరలేదు. ఆయన నామమంత్రం చాలు.. దుష్టశక్తులను నామరూపాలు లేకుండా చేయడానికి!
ఎప్పుడైతే స్వామి స్తుతిని మనసులో సంకల్పించాడో..
అప్పుడే..
భూమిలో నుంచి జ్వాల ఆవిర్భవించింది.
ఆ జ్వాల వలయమై తిరుగుతూ.. తిరుగుతూ..
ఆ రాక్షసుణ్ని చుట్టుముట్టింది.
అంతే..
హాహాకారాలు చేస్తూ.. ఆ వికృతాకారం విరూపమై, భస్మమై పంచభూతాల్లో కలిసిపోయింది.
హాహాకారాలు, భయంకర విస్ఫోటనా శబ్దాలూ వినబడి.. కళ్లు తెరిచి చూశాడు యాదరుషి.
శ్రీ నరసింహుడి నామమంత్ర శక్తి చేత.. ఆనవాళ్లు లేకుండా అదృశ్యమైపోయాడు ఆ రాక్షసుడు.
అంతా నరసింహుడి లీల. నెపం పరీక్షే! రక్షణా ఆయనదే!!
యాదరుషి తపస్సుకు ఉద్యుక్తుడయ్యాడు.
నరసింహస్వామిని మనసులో బలంగా తలుచుకున్నాడు. పరిపరి విధాలా స్వామిని నుతించాడు.
నమోస్తు నారాయణ నారసింహ
నమోస్తు నారాయణ వీరసింహ
నమోస్తు నారాయణ క్రూరసింహ
నమోస్తు నారాయణ దివ్యసింహ॥
నమోనమో నిర్జిత కాలసింహ
నమోనమః కల్పిత కల్పసింహ
నమోనమః కామద కామ సింహ
నమోనమస్తే భువనైక సింహ॥
అని స్వామిని మనసారా కీర్తించి తపస్సు మొదలుపెట్టాడు.
అత్యంత భక్తిశ్రద్ధలతో అద్భుత దీక్షతో..
యాదరుషి దివ్య గాథామృతాన్ని అందరికీ అందిస్తున్న మహా మేధావి విజ్ఞానేశ్వరుడు, ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు.
“కారణజన్ముడు, మహర్షి యాదరుషి వారి దివ్య చరితను మననం చేసుకున్న కొద్దీ మధురం అనిపిస్తున్నది. నాకు ఈ సదవకాశాన్ని కల్పించిన ప్రభువులు త్రిభువనమల్ల చక్రవర్తి వారికీ, సామ్రాజ్ఞి చంద్రలేఖా దేవిగారికి అభినందన సుమాలు.”
అది వింటున్న ప్రభువు త్రిభువనమల్లుడికి, చంద్రలేఖకు, భక్తి శ్రద్ధలతో వింటున్న అధికార, అనధికార ప్రముఖులకు కూడా యాదరుషి జీవన సాఫల్యతలోని అత్యద్భుత ఘట్టాలు..
ఇప్పుడే, ఇక్కడే.. మన కనుల ముందే జరుగుతున్నవా అన్నంత ఆనందోత్సాహాలు కలిగాయి.
కృష్ణానదీ తీరంలో.. త్రిభువనమల్లుడు, చంద్రలేఖ, ఇతర పుర ప్రముఖులు ఆసీనులై ఉన్నారు.
విద్యావేత్త, పరమ ధార్మికుడు, భువనగిరి ఆస్థానంలో న్యాయ శాస్త్రవేత్త.. ‘యాజ్ఞవల్క్య స్మృతి’కి సుందరమైన వ్యాఖ్యానం రాసిన విజ్ఞానేశ్వరుడు.. ఎన్నెన్నో గ్రంథాలను ఎవరికీ లభ్యంకాని తాళపత్రాలను సేకరించి, స్కంద పురాణం, పద్మ పురాణం, బ్రహ్మ పురాణం, నారసింహ పురాణాల నుంచి విలువైన సమాచారాన్ని సేకరించి, యాదరుషి చరితను, శ్రీ లక్ష్మీ నరసింహుడి ఆవిర్భావ అవతార ఘట్టాలను, రసవత్తరంగా సభక్తితో శ్రీ నరసింహుడి ఆరాధకుల ముందు ఉంచాడు.
ముందుగా త్రిభువనమల్లుడు విజ్ఞానేశ్వరునికి అభివాదం చేసి, అన్నాడు..
“విజ్ఞానేశ్వరా.. మీరు యాదరుషి చరిత్రను వివరించిన తీరు దృశ్య మాపకంగా కనులకు కట్టినట్టు మాకు తెలియజేశారు. స్వామి దర్శనాన్ని సాధించడానికి యాదరుషి వారు ఎన్నెన్ని బాధలు పడ్డారో.. పరీక్షలను ఎదుర్కొన్నారో.. మాకు అవగతమైంది. వారి పేరు తలచినంతనే సకల శుభాలు కలుగుతాయని చెప్తారు..”
“అవును.. త్రిభువనమల్ల చక్రవర్తీ! శ్రీరాముడి దూత హనుమ ఎంతటి శక్తి సంపన్నుడో, సేవాగుణ సార్వభౌముడో.. శ్రీ నరసింహుడి భక్తుడిగా, స్వామిని దర్శనం చేసుకొని దేవుడి కొండకే తనపేరు వచ్చేంతగా.. స్వామి అనుగ్రహం పొందిన మహాత్ముడు యాదరుషి. ఆయన దివ్య చరితం వినడం జన్మకో అదృష్టం. ఆ మహర్షి తపోదీక్షా ఫలం మానవాళికి అద్భుత వరాన్ని ప్రసాదించింది.”
చిరునవ్వుతో వివరించాడు విజ్ఞానేశ్వరుడు.
అప్పుడు ఒక సందేహం కలిగింది..
రాణి చంద్రలేఖకు.
“స్వామీ! నాదొక సందేహం!” వినయంగా పలికింది ఆమె కంఠస్వరం.
“ఏమిటమ్మా.. ఆ సందేహం?” అడిగాడు విజ్ఞానేశ్వరుడు.
“మరేమీ లేదు స్వామీ! నా భర్త, ఈ సామ్రాజ్యాధినేత అయిన ప్రభువుల వారు.. మనసావాచా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమ్ముకొన్నారు. విలాసవంతమైన సౌకర్యాలను వదిలిపెట్టి.. ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లి, కొండ ఎక్కి అనేక అవస్థలు పడి, స్వామి కొలువైన కొండ గుహను కనుక్కున్నారు. నారసింహుడి నామం తప్ప మరొకటి లేదని, హృదయపూర్వకంగా శ్రీ నరసింహుడికి ఆరాధకుడిగా మారారు” చెబుతూ ఆగింది చంద్రలేఖ.
“అవును త్రిభువనమల్ల ప్రభువులవారు, నరసింహుడికి ఒక పరిపూర్ణమైన భక్తుడిగా మారారు. స్వామి అనుగ్రహాన్ని పొందారు. దీనిలో మీ సందేహమేమిటి?”
ఆమె మనసులో ఉన్న మాట ఏమిటో, సరిగా అర్థంకాక అడిగాడు విజ్ఞానేశ్వరుడు.
“మరి వీరు గొప్ప భక్తులు. ఆ స్వామివారేమో అనుగ్రహ మూర్తులు. మరి ఈ సామ్రాజ్యంలో సమస్యలు, చీకాకులు ఎందుకు ఏర్పడుతున్నాయి? స్వామిని నమ్ముకుంటే, జయాలే కానీ అపజయాలు ఎందుకు వస్తున్నాయి? మనోవేదన ఎందుకు ఏర్పడుతున్నది? ఏమిటీ నరసింహమాయ? కొలిచేవారికే కష్టాలేల? నమ్మి సేవలు చేసేవారికే సమస్యలేల? పరిపరి విధాలుగా ప్రార్థించే వారికే పరీక్షలేల? ఎందుకిలా జరుగుతున్నది? దైవభక్తి అనేది రక్షణగా ఉండాలి కానీ, శిక్షగా ఉండకూడదు కదా?”
అప్పుడు అర్థమయింది విజ్ఞానేశ్వరుడికి.
ఈ మహారాణివారు కోరుకుంటున్నది ఎటువంటి కష్టాలు లేని కాలాన్ని.. ఈమె ఆకాంక్షిస్తున్నది అవరోధాలు లేని విజయపథాన్ని!
“అమ్మా, మీ ఆవేదనకు అర్థం ఉంది. కానీ, ఆ పరమాత్ముడి లీలకు ఒక పరమార్థం ఉంటుంది. స్వామి పరీక్షించేది మన భక్తిని, మన శ్రద్ధను! అది శిక్ష కాదు. శిక్షణ. సమస్త సమాజానికది ఒక రక్షణ.”
అనునయంగా పలికినా.. ఆ మాటలు కఠినంగా వినిపించాయి చంద్రలేఖకు.
“మరి స్వామి నరసింహావతారం ధరించినదే దుష్టుల సంహారానికి కదా! మరి భక్తుడిపై దుష్టులు, మిత్రద్రోహులు దండెత్తి వస్తుంటే, స్వామి ఊరకే చూస్తూ ఉపేక్షిస్తాడా?” అసహనంగా అడిగింది చంద్రలేఖ.
చంద్రలేఖ వదనంలో కనిపిస్తున్న ఆందోళనను గమనించాడు త్రిభువనుడు.
ఆమె బాధ ఆమెది. తన భర్త భక్తుడైన తర్వాత కూడా స్వామి ఇంకా ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఎందుకు అపజయాల వైపు మళ్లుతున్నది మార్గం? కానీ, నమ్మకం అనేది శాశ్వతంగా ఉండవలసిన లక్షణం. భగవంతుడిని మనసారా నమ్మే భక్తులు, తల్లిదండ్రులను పూర్తిగా నమ్మే పిల్లలు, గురువును పరిపూర్ణంగా నమ్మి అనుసరించే శిష్యులు.. ఘనమైన చరిత్ర ఉన్న నాయకుడిని గాఢంగా అభిమానించి నమ్మే అనుచరులు, ప్రజలు – తమ నమ్మకాన్ని క్షణక్షణానికీ పరీక్ష చేసుకోరు. అడుగడుక్కీ రుజువులు చూపే ప్రయత్నాలు చేయరు. ఆ అవసరం రాదు, రాకూడదు.
“రాణీ చంద్రలేఖా! ఎందుకీ అనవసరమైన ఆలోచన? మేం సురక్షితంగా ఉన్నాం. సామ్రాజ్యాన్ని, ప్రజలను సురక్షితంగా ఉంచుతాం. ఆ విషయమై ఎవరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. పరీక్షించనీ.. ఆ కల్యాణ కారకుడు, అవరోధాలు కల్పించనీ, ఆయననే నమ్ముదాం.. మనల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడనీ! ఆయననే వేడుకుందాం సమాజంలో ప్రతిరోజూ ఒక వేడుకలా ఉండాలని, ఉంచాలని! విజ్ఞానేశ్వరా! మీరు జ్ఞాన సంపన్నులు. ఎన్నో పురాణాలను, అనుభవాలను, లోకజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నారు. మీరే చెప్పండి.. మేమేం చేయాలో? మా రాణిగారి ఆందోళన ఎలా తొలగిపోతుందో?”
విజ్ఞానేశ్వరుడు తలపంకించాడు
ఏదో ఆలోచన మెరిసింది.
“అమ్మా.. మీరు అన్నది నిజమే! దుష్టశిక్షణ కోసమే నరసింహ అవతారం ఉద్భవించింది. మరి ఆయన ఎటువంటి వాడు? విష్ణు సహస్ర నామంలో 22వ శ్లోకం ఏం చెబుతున్నదో తెలుసా?
“అమృత్యున్సర్వ దృక్సింహాః సంధాతా సంధిమాన్ స్థిరః
అజో దుర్మర్షణ శ్శాన్తా విశ్రుతాత్మా సురారిహః
స్వామివారు మృత్యువుకే మృత్యువు వంటివాడు. అందరిపైనా సమదృష్టి ప్రసరించేవాడు కనుక సర్వతో ముఖుడయ్యాడు.
శత్రువులనే మదపుటేనుగులను తుదముట్టించే భయంకరమైన సింహం వంటివాడు. శత్రువులకు భయంకరంగా కనిపించినప్పటికీ, తనను నమ్మిన ఆశ్రితులను చేరదీసి, వారితో ఎల్లప్పుడూ చేరి ఉండేవాడు.
అలా చేరినప్పుడు వారి స్వల్ప అపచారాలను మన్నించి మంచి మార్గం చూపేవాడు. స్తంభంలో ఉద్భవించినందువల్ల ఇతరుల వలే జన్మ ఎత్తనివాడు, విరోధులచే సంహింపజాలని వాడు, దుర్జనులను శిక్షించేవాడు.. అంటూ విశదీకరిస్తుంది. అయితే, మనందరం నరసింహావతారంలోని మర్మమూ, ధర్మమూ వివరంగా తెలుసుకోవాల్సి ఉంది.
ఏమిటా ధర్మమూ.. మర్మమూ!
-అల్లాణి శ్రీధర్