బ్రిస్బేన్: గత మ్యాచ్లో పాకిస్థాన్పై అద్భుత విజయం సాధించి ఊపుమీదున్న జింబాబ్వే.. బంగ్లాదేశ్తో చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అత్యంత నాటకీయత మధ్య సాగిన ఫైనల్ ఓవర్లో జింబాబ్వే ఒత్తిడికి చిత్తైంది. జింబాబ్వే విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి రాగా.. ఆ జట్టు 12 పరుగులే చేసింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ముజర్బాని (0 నాటౌట్) స్టంపౌట్ కావడంతో బంగ్లా సంబురాల్లో మునిగిపోగా.. వికెట్ కీపర్ బంతిని వికెట్లు దాటక ముందే అందుకోవడాన్ని రిప్లేలో గమనించిన అంపైర్లు దాన్ని నోబాల్గా ప్రకటించారు.
దీంతో అప్పటికే గ్రౌండ్ వీడిన జింబాబ్వే ఆటగాళ్లు తిరిగి క్రీజులోకి వచ్చారు. జింబాబ్వే విజయానికి చివరి బాల్కు నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా.. ముజర్బాని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. నజ్ముల్ హుసేన్ (71; 7 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. షకీబ్ అల్ హసన్ (23), అఫిఫ్ హుసేన్ (29) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని, రిచర్డ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం చేజింగ్లో జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్ చేసింది. సీన్ విలియమ్స్ (42 బంతుల్లో 64; 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. జట్టును విజయానికి చేరువ చేసిన విలియమ్స్ కీలక సమయంలో షకీబ్ వేసిన సూపర్ త్రోకు రనౌట్ కావడం జింబాబ్వేను దెబ్బకొట్టింది. బంగ్లా బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 3, ముస్తఫిజుర్, మొసద్దక్ చెరో రెండో వికెట్లు పడగొట్టారు. తస్కీన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.