తొలి రెండు మ్యాచ్ల్లో అలవోకగా నెగ్గిన టీమ్ఇండియాకు మూడో వన్డేలో జింబాబ్వే గట్టి పోటీనిచ్చింది. శుభ్మన్ గిల్ కెరీర్లో మొదటి సెంచరీతో చెలరేగడంతో రాహుల్ సేన భారీ స్కోరు చేయగా.. ఛేదనలో సికందర్ రజా పోరాటం కట్టిపడేసింది. వరుసగా మూడో విజయంతో సిరీస్ క్లీన్స్వీప్ చేసిన టీమ్ఇండియా.. ఇక ఆసియా కప్ కోసం సిద్ధం కానుంది!
హరారే: టీమ్ఇండియా విజయం పరిపూర్ణమైంది. తొలి రెండు వన్డేలను ఏకపక్షంగా గెలుచుకున్న రాహుల్ సేనకు.. ఆఖరి పోరులో జింబాబ్వే నుంచి గట్టి పోటీ ఎదురైనా.. అంతిమ విజయం మాత్రం రాహుల్ సేననే వరించింది. సోమవారం జరిగిన పోరులో భారత్ 13 పరుగుల తేడాతో నెగ్గి మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ఈ సారి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది.
యువ ఆటగాడు శుభ్మన్ గిల్ (97 బంతుల్లో 130; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. ఇషాన్ కిషన్ (50), శిఖర్ ధవన్ (40), కెప్టెన్ కేఎల్ రాహుల్ (30) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (115; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు.
ఇతర ఆటగాళ్ల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో సహకారం లభించకపోయినా.. బ్రాడ్ ఇవాన్స్ (28)తో కలిసి 8వ వికెట్కు 104 పరుగులు జోడించి భారత బౌలర్లను భయపెట్టాడు. 9 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో గిల్ పట్టిన సూపర్ క్యాచ్కు సికందర్ ఔట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. మన బౌలర్లలో అవేశ్ఖాన్ 3, దీపక్, కుల్దీప్, అక్షర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మూడు మ్యాచ్ల్లో కలిపి 245 పరుగులు చేసిన గిల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
90 పరుగుల మార్క్ దాటిన తర్వాత నా గుండె వేగం పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మూడుసార్లు 90ల్లో ఔటయ్యా.. ఒక్క శతకం కూడా నమోదు చేయలేకపోవడంతో కాస్త ఒత్తిడికి గురయ్యా. ఈ సెంచరీ చాలా ప్రత్యేకమైనది. చిన్నతనంలో మా నాన్నే నాకు కోచ్గా వ్యవహరించారు. ఈ శతకం ఆయనకే అంకితం. సికందర్, బ్రాడ్ ఇవాన్స్ చక్కగా బౌలింగ్ చేస్తుండటంతో.. ఇతర బౌలర్లను టార్గెట్గా చేసుకొని పరుగులు రాబట్టా.
-శుభ్మన్ గిల్
భారత్: 50 ఓవర్లలో 289/8 (గిల్ 130, ఇషాన్ 50; బ్రాడ్ 5/54), జింబాబ్వే: 49.3 ఓవర్లలో 276 ఆలౌట్ (సింకందర్ 115; అవేశ్ 3/66, అక్షర్ 2/30).