Yuvraj Singh : భారత జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచి ఇప్పటికి 11 ఏండ్లు దాటింది. నిరుడు సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో ఆసాంతం అదరగొట్టి తీరా ఫైనల్లో చతికిలబడింది. మరో ఐదు నెలల్లో మొదలయ్యే టీ20 ప్రపంచ కప్ టోర్నీకి రోహిత్ సేన సన్నద్ధమవుతోంది. ఈ సమయంలో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ట్రోఫీ గెలవాలంటే ఒకరిద్దరూ కాకుండా జట్టు మొత్తం రాణించాలని అన్నాడు.
‘పెద్ద మ్యాచుల్లో ఒక్కరిద్దరు ఆడితే సరిపోదు. జట్టు మొత్తం బాగా ఆడాలి. ఒత్తిడిలో కూరకుపోయిన సమయంలో మన శారీరక సన్నద్ధతకు ఢోకా లేదు. కానీ, మానసికంగా బలంగా ఉండాలి. సమిష్టిగా రాణించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఐసీసీ ట్రోఫీ గెలవగలం’ అని యువరాజ్ వెల్లడించాడు. అంతేకాదు ఈసారి టీ20 వరల్డ్ కప్లో భయం లేకుండా ఆడాలని భారత జట్టుకు సలహా ఇచ్చాడు.
భారత జట్టు గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైన యవరాజ్ సింగ్ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో యూవీ సంచలన ఆటతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అంతేకాదు ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో శివాలెత్తిన యూవీ.. స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు సిక్సర్లతో చరిత్ర సృష్టించాడు.
యవరాజ్ సింగ్, స్టువార్ట్ బ్రాడ్
భారత గడ్డపై 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్లోనూ ఈ స్టార్ ఆల్రౌండర్ అదరగొట్టాడు. ధోనీ(Dhoni) సారథ్యంలోని టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. సెమీస్లో ఆస్ట్రేలియాపై సురేశ్ రైనాతో కలిసి నాటౌట్గా నిలిచాడు. అయితే.. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడడంతో కొన్నాళ్లు విరామం తీసుకున్న యువరాజ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.