న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక థామస్ కప్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ జట్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. బ్యాంకాక్ వేదికగా గతవారం జరిగిన టోర్నీలో కిడాంబి శ్రీకాంత్ సారథ్యంలోని భారత బృందం.. ఇండోనేషియాపై నెగ్గి తొలిసారి స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ ముగిసిన వెంటనే షట్లర్లను ఫోన్లో అభినందించిన ప్రధాని.. ఆదివారం తన నివాసంలో వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. ఇది సాధారణ విజయం కాదు. ఒకప్పుడు ఈ టోర్నీలో పాల్గొనడమే పెద్ద గొప్పగా అనుకునే వాళ్లం.. ఇప్పుడు సగర్వంగా చాంపియన్లుగా నిలిచాం. మీకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం’అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రణయ్, అర్జున్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టి, ఉన్నతి హుడా తదితరులు పాల్గొన్నారు.