Wrestlers Protest | న్యూఢిల్లీ: కుస్తీ యోధుల పోరాటం అనుకోని మలుపు తిరిగింది. ఇన్ని రోజులు మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిరసన జరుగగా, తాజాగా తమ రెజ్లింగ్ కెరీర్లను కోల్పోతున్నామంటూ వందల మంది యువ రెజ్లర్లు పోరుబాట పట్టారు. ఏడాది కాలంగా నిరసన చేస్తున్న బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్కు వ్యతిరేకంగా దాదాపు 300 మంది యువ రెజ్లర్లు బుధవారం జంతర్మంతర్ దగ్గర భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ అకాడాల నుంచి చలిని సైతం లెక్కచేయకుండా జంతర్మంతర్ వద్దకు చేరుకున్నారు.
గతేడాది ఇదే సమయంలో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ నిరసన చేసి చోటే యువ రెజ్లర్లు ప్లకార్డులతో నినాదాలు చేశారు. స్టార్ రెజర్ల నిరసన కారణంగా ఏడాది కాలంగా షెడ్యూల్కు అనుగుణంగా రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీలు జరుగకపోవడం వలన తమ కెరీర్లకు ప్రతిబంధకంగా మారిందని తమ గళం విప్పారు. ఎంతో విలువైన తమ కెరీర్లు వీరి వల్ల నాశనం అవుతున్నాయంటూ ధ్వజమెత్తారు. పది రోజల వ్యవధిలో జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ)ని పునరుద్ధరించాలని, లేనిపక్షంలో తిరిగి ఢిల్లీ నడివీధుల్లో పోరుబాట పడుతామని హెచ్చరికలు జారీచేశారు.
చంపేస్తామంటూ బెదిరింపులు:
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ అనుచరులు చంపేస్తామని బెదిరిస్తున్నారని సాక్షి మాలిక్ పేర్కొంది.