హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ తెలంగాణ కబడ్డీ చాంపియన్షిప్లో జోగులాంబ లయన్స్ విజేతగా నిలిచింది. బుధవారం ఎల్బీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో జోగులాంబ లయన్స్ 35-21తో భద్రాద్రి బ్రేవ్స్పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి జోగులాంబ 16-12తో ఆధిక్యంలో నిలిచింది. కీలకమైన ద్వితీయార్థంలోనూ అదే దూకుడు కనబరుస్తూ లయన్స్ పైచేయి సాధించింది. ఓవైపు మెరుపు రైడింగ్కు తోడు పటిష్టమైన డిఫెన్స్తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో లయన్స్ సఫలమైంది. టోర్నీ బెస్ట్ రైడర్గా రాజు, డిఫెండర్గా నవీన్, ఆల్రౌండర్గా లక్ష్మణ్ ప్రోత్సాహకాలు అందుకున్నారు. విజేత జోగులాంబకు లక్ష, రన్నరప్ భద్రాద్రి టీమ్కు 75 వేల నగదు బహుమతి దక్కింది. టోర్నీ ముగింపు కార్యక్రమానికి డీసీపీ హైదరాబాద్ రాహుల్ హెగ్డె ముఖ్య అతిథిగా హాజరు కాగా, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.