Sai Praneeth | న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ క్రీడకు యువ షట్లర్ సాయిప్రణీత్ వీడ్కోలు పలికాడు. గత కొన్నేండ్లుగా గాయాలతో సతమతమవుతున్న సాయిప్రణీత్ కెరీర్కు గుడ్బై చెబుతున్నట్లు సోమవారం తన ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించాడు. గాయాలతో ఫిట్నెస్ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రణీత్ పేర్కొన్నాడు. ఈ తన సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ప్రణీత్..కృతజ్ఞతలు తెలిపాడు. అమెరికాలో ఒక క్లబ్కు సేవలు అందించబోతున్నట్లు తన భవిష్యత్ ప్రణాళికను వివరించాడు. దేశ బ్యాడ్మింటన్పై తనదైన ముద్ర వేసిన సాయి ప్రణీత్.. కెరీర్కు వీడ్కోలు పలుకడంపై స్పందిస్తూ ‘డియర్ బ్యాడ్మింటన్ థాంక్యూ..అన్ని రకాల భావాల మేళవింపుతో ఇది రాసుకొస్తున్నాను. బ్యాడ్మింటన్తో 24 ఏండ్లకు పైగా ఉన్న సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలుకుతూ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుంచి కెరీర్లో కొత్త చాప్టర్ మొదలుపెడుతున్నాను. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన అందరికీ రుణపడి ఉంటాను.
అభిమానుల అపూర్వ మద్దతు..నా గొప్ప బలం. ప్రతీసారి మీరు ఇచ్చిన సపోర్ట్..జెండా ఎగిరినప్పుడల్లా నా ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతూ నమ్మకం బలపడింది. నా కెరీర్లో మీరు భాగం కావడం ఆశీస్సులకు ఏ మాత్రం తక్కువ కాదు. బ్యాడ్మింటన్ ఆటపై నాది తొలిప్రేమ, నేను గుర్తింపులోకి వచ్చింది ఆట ద్వారా మాత్రమే. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, ఎన్నో అడ్డంకులను అధిగమించాను. అవి నా హృదయంలో పదిలంగా ఉంటాయి. ఈ సందర్భంగా నాకు మద్దతు నిలిచిన తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, భార్య శ్వేత..మీ మద్దతు నా కెరీర్ ఉన్నతికి ఎంతగానో దోహదపడింది. మీ సహకారం లేకపోతే..ఇది సాధ్యపడకపోయేది. గోపీచంద్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అకాడమీకి, కోచింగ్, సహాయ సిబ్బందికి అందరికీ థ్యాంక్స్. కెరీర్ తొలినాళ్లలో తీర్చిదిద్దిన ఆరిఫ్ సార్, గోవర్ధన్ సార్కు ధన్యవాదాలు. బాయ్కు, సాయ్కు, సాట్స్కు, బెంగళూరు ర్యాప్టర్స్, హైదరాబాద్ హంటర్స్, అవధే వారియర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడితో బ్యాడ్మింటన్ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నాను. కానీ ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది. అది ప్లేయర్గా గాకుండా కోచ్గా, మెంటార్గా ఏదో ఒక రూపంలో ఆట అభివృద్ధిలో భాగమవుతాను’ అని రాసుకొచ్చాడు.
రెండు దశాబ్దాల కెరీర్ కల్గిన హైదరాబాద్ షట్లర్ సాయిప్రణీత్..తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించాడు. 2017లో సింగపూర్ ఓపెన్ గెలిచిన ఈ 31 ఏండ్ల యువ షట్లర్ 2019 ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్-10 ర్యాంకింగ్స్లో నిలువడం ద్వారా ప్రతిష్ఠాత్మక టోక్యో(2020) ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. అయితే ఆడిన మూడు లీగ్ మ్యాచ్ల్లో ఓడటం ద్వారా మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయాడు. అప్పటి నుంచి చాలాసార్లు గాయాల పాలు అవుతున్న సాయిప్రణీత్ పూర్తి స్థాయిలో ఆటతీరు ప్రదర్శించడంలో విఫలమవుతూ వచ్చాడు. ఓవైపు యువ షట్లర్లతో పోటీ నెలకొనడం, ఫిట్నెస్ సమస్యలు ఇబ్బంది పెట్టడం అతనికి కెరీర్కు ప్రతిబంధకంగా మారాయి. ఇదిలా ఉంటే అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీలో హెడ్కోచ్గా ప్రణీత్ బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. అక్కడ ప్లేయర్ల ఆటతీరును పరిశీలించనున్నాడు. తన పాత్రపై త్వరలో మరిన్ని విషయాలు వెల్లడిస్తానని ఈ సందర్భంగా ప్రణీత్ పేర్కొన్నాడు.