నింగ్బో(చైనా): బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్లో భారత యువ షట్లర్ ఆయూష్ శెట్టి సంచలనం సృష్టించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆయూష్ అద్భుత విజయాలతో ప్రత్యర్థులను చిత్తుచేస్తున్నాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయూష్ 10-21, 21-19, 21-17తో టాప్సీడ్, ప్రపంచ చాంపియన్ కున్లావత్ వితిద్సర్న్పై చిరస్మరణీయ విజయం సాధించాడు. టోర్నీ ఆసాంతం తనదైన దూకుడు కనబరుస్తున్న ఆయూష్ సెమీస్లో అదే ఒరవడి కొనసాగించాడు. తద్వారా 60 ఏండ్ల తర్వాత ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారత షట్లర్గా శెట్టి నిలిచాడు. 1965లో పురుషుల సింగిల్స్లో స్వర్ణం గెలిచిన ఏకైక భారత ప్లేయర్గా దినేశ్ ఖన్నా నెలకొల్పిన రికార్డును ఇప్పటికీ ఎవరూ తుడిచిపెట్టలేకపోయారు. మ్యాచ్ విషయానికొస్తే 75 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన ఆయూష్..రెండో గేమ్ నుంచి పుంజుకుని పోటీలోకి వచ్చాడు. తొలి గేమ్ తప్పిదాలను పునరావృతం చేయకుండా ముందుకు సాగిన శెట్టి చిరస్మరణీయ విజయంతో చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు.