బెనోని: ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో కప్ గెలువడమే లక్ష్యంగా ఎంచుకుంది. బుధవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత గొంగడి త్రిష(51 బంతుల్లో 57, 6ఫోర్లు) అర్ధసెంచరీకి తోడు రిచా ఘోష్(33) ఇన్నింగ్స్తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 149/4 స్కోరు చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన తెలంగాణ యువ క్రికెటర్ త్రిష…జట్టుకు మెరుగైన శుభారంభాన్ని ఇచ్చింది.
స్కాట్లాండ్ బౌలింగ్ను సమర్థంగా నిలువరిస్తూ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో విజృంభించింది. ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లతో అలరించిన ఈ యంగ్ బ్యాటర్ సహచరులతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. క్యాథరీన్ ఫ్రెజర్(2/31) రెండు వికెట్లు తీసింది. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన స్కాట్లాండ్..మన్నత్ కశ్యప్(4/12), అర్చనా దేవి(3/14) ధాటికి 13.1 ఓవర్లలో 66 పరుగులకు కుప్పకూలింది. డార్సీ కార్టర్(24) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. సోనమ్ యాదవ్(2/1) ఆకట్టుకుంది. మూడింట మూడు విజయాలతో యువ భారత్ గ్రూపు-డిలో ఆరు పాయింట్లతో టాప్లో ఉండగా, దక్షిణాఫ్రికా(4), యూఏఈ(2) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.