Bazball | టెస్టులలో ఒక్కరోజులోనే 500 ప్లస్ స్కోరు చేసిన (పాకిస్తాన్పై) జట్టు అది.. క్రీజులోకి వస్తే బెరుకన్నదే లేకుండా టెస్టులలోనూ టీ20 ఆడుతున్న బ్యాటర్లు ఆ జట్టు సొంతం.. ప్రత్యర్థి ఎవరైనా బాదుడే వాళ్ల మంత్రం.. గెలుపోటముల సంగతి పక్కనబెడితే బ్యాటింగ్కు వస్తే దంచుడు, బౌలింగ్ అయితే ప్రత్యర్థులను కూల్చుడు ఆ జట్టు తంత్రం.. సంప్రదాయ టెస్టు క్రికెట్ ఆడే విధానానికి పూర్తి విరుద్ధంగా తాము ఆడే ఆటతీరుకు ‘బజ్బాల్’ అని పేరు పెట్టుకున్న ఇంగ్లండ్ రాజ్కోట్ టెస్టులో భయపడిందా..? తొలి ఇన్నింగ్స్లో భాగంగా రెండో రోజు 35 ఓవర్లలో ఏకంగా 5.91 రన్రేట్తో 207 పరుగులు చేసిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆడింది. ఎందుకిలా..? బెన్ స్టోక్స్ అండ్ కో. భయపడిందా..?
ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేస్తూ సాగే బజ్బాల్ పప్పులు భారత్లో ఉడకడం లేదు. స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్కు చుక్కలు చూపించిన బెన్ స్టోక్స్ సేనకు అసలైన సవాల్ భారత్లోనే అని క్రికెట్ విశ్లేషకులు విశ్లేషణలు చేశారు. అయితే హైదరాబాద్ టెస్టులోనే ఇంగ్లండ్.. వారి అంచనాలను తారుమారు చేసింది. విజయం కోసం ఆఖరి బంతి వరకూ పోరాడతామని రుజువు చేసింది. ఆ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయినా రెండో ఇన్నింగ్స్లో పుంజుకుని భారత్ను కూడా స్పిన్ ఉచ్చులో బంధించింది.
కథ అడ్డం తిరిగింది..
వైజాగ్లోనూ అదే ఆటతీరుతో ఆడిన ఇంగ్లండ్ బొక్కబోర్లా పడింది. రోహిత్ సేన నిర్దేశించిన 399 పరుగుల ఛేదనలో ఆ జట్టు.. 298 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇక కీలకమైన రాజ్కోట్ టెస్టులో బౌలింగ్లో ఇంగ్లండ్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. మార్క్ వుడ్, అండర్సన్ వంటి పేసర్లతో పాటు స్పిన్నర్లు హర్ట్లీ, అహ్మద్లు చూపించిన ప్రభావం శూణ్యం. అయితే బ్యాటింగ్కు అనుకూలించిన రాజ్కోట్ పిచ్పై తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు ధనాధన్ ఆట ఆడుతూ పరుగులు రాబట్టింది. 88 బంతుల్లోనే బెన్ డకెట్ సెంచరీ చేయడంతో ఆ జట్టు స్కోరు రెండో రోజు 35 ఓవర్లలోనే 200 దాటింది.
ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్.. ఇంగ్లండ్ ఎదుట 557 పరుగల టార్గెట్ను పెట్టింది. అయితే మరో రోజున్నర ఆట మిగిలుండటం, ఇంగ్లండ్ కూడా దంచికొట్టే స్వభావంతో ఉండటంతో పాటు పిచ్ సైతం బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మంచి భాగస్వామ్యాలు నమోదు అయి ఇద్దరు ముగ్గురు బ్యాటర్లు క్రీజులో నిలిచినా ఇంగ్లండ్ ఏదైనా అద్భుతాలు చేస్తుందేమో అని అభిమానులు భావించారు. భారత అభిమానుల్లో కూడా ఆ అనుమానం ఏ మూలనో ఉంది. కానీ ఇంగ్లండ్ మాత్రం దారుణంగా నిరాశపరిచింది.
ఇది ఇంగ్లండేనా..?
ఆది నుంచే బాదుడు మంత్రాన్ని పాటించే ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో క్రీజులోకి వచ్చిన తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేసింది. మూడో ఓవర్లో పరుగుల ఖాతా తెరిచింది. బుమ్రా, సిరాజ్లు వేసిన బంతులను క్రాలే, డకెట్లు డిఫెన్స్ ఆడేందుకు యత్నించారు. ఆరు ఓవర్లలో ఆ జట్టు చేసిన స్కోరు 15 పరుగులు. ఏడో ఓవర్ నుంచి ఆ జట్టు వికెట్ల పతనం మొదలైంది. టాపార్డర్లో ఉన్న బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ధాటిగా ఆడి భారత బౌలర్లకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నమే చేయలేదు. ఓలీ పోప్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్.. పేర్లు ఏవైనా ఒక్కరు కూడా భారత స్పిన్నర్ల దాడిని ఎదుర్కోలేకపోయారు. గడిచిన రెండేండ్లుగా బజ్బాల్ ఆటతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తున్నది కూడా ఈ వీరులే మరి.. టాపార్డర్, మిడిలార్డర్ తేడా లేకుండా అందరూ ఆర్డర్గా వచ్చినోళ్లు వచ్చినట్టు పెవిలియన్ చేరారు. ఆఖరికి 9వ స్థానంలో వచ్చిన మార్క్ వుడ్ మెరుపులతో ఆ జట్టు వంద పరుగులు దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. అదీగాక ఓపెనర్లు క్రాలే-డకెట్ నుంచి మొదలుకుని పోప్, రూట్, స్టోక్స్, బెయిర్ స్టోల ముఖాల్లో గెలవాలనే కాంక్షను పక్కనబెడితే డ్రా చేసుకుందామన్న తపన కూడా కనబడలేదు. ‘రేపటిదాకా ఆగడమెందుకు..? ఇవ్వాళే ఆలౌట్ అయిపోదాం..’ అన్న ఆత్రుత వాళ్ల బ్యాటింగ్ చేసే విధానంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. నాలుగో రోజు ఫీల్డింగ్ చేసేప్పుడు కూడా ఇంగ్లండ్ ఆటగాళ్ల ముఖాల్లో ఎనర్జీ కనపించలేదు.
2022 జూన్లో ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు పగ్గాలు అందుకున్న బెన్ స్టోక్స్కు తొలిసారిగా నాలుగో ఇన్నింగ్స్లో ఓ కెప్టెన్ డిక్లేర్ ఇవ్వడం విశేషం. ఇప్పటివరకూ 22 టెస్టులకు సారథ్యం వహించగా ప్రత్యర్థి జట్లకు చెందిన ఏ ఒక్క కెప్టెన్ కూడా నాలుగో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్పై డిక్లేర్ ప్రకటించలేదు. ఆ ఘనతను రోహిత్ దక్కించుకున్నాడు.