వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా మొదలుకావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ గెలవాలంటే ఒకరిద్దరు ఆటగాళ్లు బాగా ఆడితే సరిపోదని, జట్టుగా ఆడితేనే విజయాలు వస్తాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియాకు సూచించాడు. కోల్కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదా.. టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్తో పాటు ఇటీవలే ముగిసిన ఆసియాకప్లో విఫలమైన టీమిండియా.. ఆస్ట్రేలియాలో మాత్రం రాణిస్తుందని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.
గంగూలీ మాట్లాడుతూ.. ‘అవును. వాళ్లు (టీమిండియా) గతేడాది టీ20 ప్రపంచకప్లో సరిగా ఆడలేదు. ఈ ఏడాది ఆసియా కప్లో కూడా విఫలమయ్యారు. ఈ ఓటములపై కెప్టెన్, కోచ్లతో బీసీసీఐ చర్చలు కూడా జరిపింది. కానీ వచ్చే టీ20 ప్రపంచకప్లో భారత జట్టు మెరుగైన ఆటతీరుతో విజయాలు సాధిస్తుందని నేను నమ్ముతున్నా.
ప్రపంచకప్కు రెండున్నర వారాలు ముందుగానే టీమిండియా ఆస్ట్రేలియాకు (అక్టోబర్ 5న) వెళ్లుతుంది. పెర్త్లో వాళ్లు ట్రైనింగ్తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్లు, వార్మప్ మ్యాచ్లు కూడా ఆడతారు. అయితే ప్రపంచకప్ నెగ్గాలంటే ఎవరో ఒకరిద్దరు ఆటగాళ్లు ఆడితే సరిపోదు. జట్టులోని ప్రతీ ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి. రోహిత్, కోహ్లీ, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ లతో పాటు బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్, చాహల్, అక్షర్.. అందరూ రాణించాలి. అప్పుడే లక్ష్యం సాధ్యమవుతుంది..’ అని తెలిపాడు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొహాలీ మ్యాచ్లో భారత్ ఓడింది. అయితే రెండో మ్యాచ్ జరిగే నాగ్పూర్కు తాను వెళ్తున్నానని.. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందని దాదా ధీమా వ్యక్తం చేశాడు.