Rohit Sharma : బంగ్లాదేశ్పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాదిన యువ ఓపెనర్పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ మ్యాచ్లో అతను వేగవంతమైన డబుల్ సెంచరీ (126 బంతుల్లో) చేసి వెస్టిండీస్ దిగ్గజం క్రిస్గేల్ రికార్డును బద్ధలు కొట్టాడు. దాంతో, డబుల్ సెంచరీ క్లబ్లో చోటు సంపాదించుకున్న ఇషాన్ను అభినందిస్తూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇషాన్ ఫొటో కింద ‘ఈ క్లబ్ మజా ప్రత్యేకంగా ఉంటుంది’ అని రాశాడు. దానికి ఇషాన్ అవును.. నిజంగానే మస్త్ మజా ఉంటుంది అని రిప్లయ్ ఇచ్చాడు. వన్డేల్లో ద్విశతకం చేసిన ఏడో బ్యాటర్గా ఇషాన్ గుర్తింపు సాధించాడు. భారత్ నుంచి రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీలు చేశారు. రోహిత్ అత్యధికంగా మూడు ద్విశతకాలు బాదాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుఫ్టిల్, వెస్టిండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్గేల్ కూడా డబుల్ సెంచరీ చేశారు.
ముంజేతి గాయంతో రోహిత్ శర్మ మూడో వన్డేకు దూరం కావడంతో ఇషాన్ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్గా వచ్చిన ఇషాన్ ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 131 బంతుల్లో 210 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అతని మెరుపు ఇన్నింగ్స్లో 10 సిక్స్లు, 24 ఫోర్లు ఉన్నాయి. ఒకవేళ అవుట్ కాకుంటే 300 కొట్టేవాడిని అని ఇషాన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. విరాట్ కోహ్లీ కూడా సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా 409 రన్స్ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 34 ఓవర్లో 182కు అలౌట్ అయింది. దాంతో భారత్ 227 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.