ఆహా.. ఏమా కొట్టుడు.. ఏమా దంచుడు! ఉపమానాలే చిన్నబోయేలా.. అతిశయోక్తులే ఆశ్చర్యపడేలా.. దిగ్గజాలే సలాం కొట్టేలా.. బౌలర్ చేతి నుంచి బంతి పడడమే ఆలస్యం దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన యశస్వి జైస్వాల్ ఐపీఎల్లో వేగవంతమైన అర్ధశతకంతో ఈడెన్ గార్డెన్స్లో శివతాండవమాడాడు.
ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో మొదట చాహల్ ధాటికి కోల్కతా ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. ఆ తర్వాత ఈడెన్లో జైస్వాల్ సునామీ సృష్టించాడు. ఫలితంగా రన్రేట్ను మెరుగుపర్చుకున్న రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
Yashasvi jaiswal | కోల్కతా: యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 98 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విశ్వరూపం కనబర్చడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆరో విజయం నమోదు చేసుకుంది. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నచందంగా విరుచుకుపడిన జైస్వాల్.. ఐపీఎల్లో వేగవంతమైన అర్ధశతకం (13 బంతుల్లో) తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఫలితంగా గురువారం జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను మట్టికరిపించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 13.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసింది. 21 ఏండ్ల యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగగా.. సంజూ శాంసన్ (29 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) సత్తాచాటాడు. యశస్వికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
తొలి ఓవర్లోనే 26..
కష్టతరం కాని లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్కు అదిరిపోయే ఆరంభం లభించింది. కోల్కతా కెప్టెన్ నితీశ్ రాణా వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 6,6,4,4,2,4తో దుమ్మురేపాడు. తొలి బంతికి లాంగాన్ మీదుగా ప్రేక్షకుల్లో పడేసి తన ఉద్దేశాన్ని చాటిన జైస్వాల్.. రెండో బంతికి స్వీప్ షాట్తో సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత మరో మూడు ఫోర్లతో తొలి ఓవర్లోనే 26 పరుగులు పిండుకున్నాడు.
బాదుడే.. బాదుడు
మరో ఓపెనర్ జోస్ బట్లర్ రనౌట్ రూపంలో వెనుదిరిగినా.. ఏమాత్రం వెనక్కి తగ్గని జైస్వాల్.. రెండో ఓవర్ చివరి రెండు బంతులకు 4,6 కొట్టాడు. ఇక శార్దూల్ ఠాకూర్ వేసిన మూడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన జైస్వాల్ 13 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకొని ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఆ తర్వాత కూడా యశస్వి జోరు కొనసాగించగా.. అతడికి సంజూ శాంసన్ తోడవడంతో అగ్నికి ఆజ్యం పోసినైట్లెంది. వీరిద్దరి దెబ్బకు పవర్ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి రాజస్థాన్ 78/1తో మ్యాచ్ను శాసించే స్థితికి చేరుకుంది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగానికి కాస్త బ్రేకులు పడ్డట్లు కనిపించినా.. జాసెన్ రాయ్ వేసిన ఓవర్లో శాంసన్ 6,6,6 బాదడంతో మ్యాచ్ దాదాపు ముగిసింది. తాజా సీజన్లో ఓ సెంచరీ నమోదు చేసుకున్న యశస్వి చివరి బంతికి బౌండ్రీ కొట్టి 98 పరుగులతో అజేయంగా నిలిచాడు.
1 ఐపీఎల్లో వేగవంతమైన (13 బంతుల్లో) అర్ధశతకం సాధించిన ప్లేయర్గా యశస్వి రికార్డుల్లో
కెక్కాడు. కేఎల్ రాహుల్, కమిన్స్ (14 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నారు.
1 ఐపీఎల్లో అత్యధిక (187) వికెట్లు పడగొట్టిన బౌలర్గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. బ్రావో (183) రెండో స్థానంలో ఉన్నాడు.
సంక్షిప్త స్కోర్లు
కోల్కతా: 149/8 (వెంకటేశ్ 57, రాణా 22; చాహల్ 4/25),
రాజస్థాన్: 13.1 ఓవర్లలో 151/1 (యశస్వి 98 నాటౌట్, శాంసన్ 48 నాటౌట్).