Yashasvi Jaiswal New Flat | టీమిండియా బ్యాటింగ్ సంచలనం యశస్వీ జైస్వాల్ జాతీయ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉంటూనే ‘ఇంటినీ’ చక్కదిద్దుకుంటున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్పై ఆడుతున్న టెస్టు సిరీస్లో మంచినీళ్లు తాగినంత ఈజీగా డబుల్ సెంచరీలు బాదుతున్న ఈ యువ బ్యాటర్.. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ఈస్ట్లో కొత్త ఫ్లాట్ కొన్నాడని సమాచారం. ఈ ఫ్లాట్ విలువ సుమారు రూ. 5.38 కోట్లు గా ఉంటుందని తెలుస్తోంది. బాంద్రా ఈస్ట్లో ఉన్న బీకేసీ ప్రాజెక్ట్లో అత్యంత అధునాతన సదుపాయాలు ఉన్న ఫ్లాట్ను గతనెలలోనే తన పేరిట రిజిష్ట్రేషన్ చేయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ను అదానీ రియాలిటీ నిర్మిస్తోంది.
పానీపూరి బండిని నడిపి కుటుంబాన్ని పోషించడమే గాక తాను క్రికెటర్ అవడానికి ఎన్నో కష్టాలుపడ్డ తన తల్లిదండ్రుల కోసం జైస్వాల్.. ఇటీవలే థానేలో 1500 స్క్వేర్ఫీట్లలో ఉన్న ఐదు బెడ్ రూమ్ల లగ్జరీ ఫ్లాట్కు మారిన విషయం తెలిసిందే. తాజాగా అతడు ముంబైలో వ్యాపారస్తులు, ధనవంతులు, సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే బాంద్రా ఏరియాలో ఫ్లాట్ కొనుక్కోవడం గమనార్హం.
View this post on Instagram
A post shared by Ignite Properties | Mumbai’s Top Real Estate Consultant (@_igniteproperties)
టెన్ బీకేసీ ప్రాజెక్ట్ విషయానికొస్తే అదానీ రియాలిటీ తుదిమెరుగులు దిద్దేందుకు సిద్ధమవుతోంది. అత్యంత అధునాతన స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఐదు ఎకరాలలో ఉంది. బాంద్రా రైల్వే స్టేషన్కు అత్యంత సమీపంలో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 8.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్లో సుమారు పది టవర్లు ఉన్నాయి. ఒక్కో అపార్ట్మెంట్ 22 అంతస్తుల ఎత్తు ఉన్నట్టు సమాచారం.
2, 3, 4 బీహెచ్కే లలో అందుబాటులో ఉన్న ఈ అపార్ట్మెంట్స్లో 3 బీహెచ్కే ఫ్లాట్ విలువ సుమారు రూ. 6 కోట్లుగా ఉన్నట్టు ఆ సంస్థ ఇన్స్టా పేజ్లో వెల్లడించింది.