WTC Final | దశాబ్ద కాలంగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బరిలోకి దిగిన టీమ్ఇండియా కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే చాన్స్ ఇచ్చిన రోహిత్ సేన.. ఓ మోస్తరు స్కోరుకే ఆలౌటై.. కంగారూలకు 173 పరుగుల ఆధిక్యం సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్లోనూ ఆసీస్ దూకుడుగా ఆడటంతో ఇప్పటికే భారత లక్ష్యం మూడొందలకు సమీపించగా.. శనివారం మరెన్ని పరుగులు చేస్తారో చూడాలి!
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన కంగరూలు.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే బాటలో పయనిస్తున్నారు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (41 బ్యాటింగ్) టాప్ స్కోరర్గా నిలువగా.. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ (34) ఆకట్టుకున్నాడు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న కంగారూలు.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం 296 పరుగుల ముందంజలో ఉన్నారు. లబుషేన్తో పాటు కామెరూన్ గ్రీన్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (1), ఉస్మాన్ ఖవాజా (13), ట్రావిస్ హెడ్ (18) విఫలమయ్యారు. భారత బౌలర్లలో జడేజా రెండు.. సిరాజ్, ఉమేశ్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 151/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా చివరకు 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్యా రహానే (129 బంతుల్లో 89; 11 ఫోర్లు, ఒక సిక్సర్) గొప్ప పోరాట పటిమ కనబర్చగా.. శార్దూల్ ఠాకూర్ (51; 6 ఫోర్లు) అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 3, స్టార్క్, బోలాండ్, గ్రీన్ తలా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. నాలుగో రోజు ఆసీస్ను వీలైనంత త్వరగా ఆలౌట్ చేస్తేనే.. ఈ మ్యాచ్లో భారత్కు పోరాడే అవకాశాలుంటాయి.
అజింక్యా అదుర్స్
టాపార్డర్ వైఫల్యంతో శుక్రవారం తీవ్ర ఒత్తడిలో బరిలోకి దిగిన టీమ్ఇండియాను రహానే కాస్త ఆదుకున్నాడు. పేలవ ఫామ్ కారణంగా జట్టుకు దూరమై.. ఐపీఎల్ మెరుపులతో టీమ్లోకి వచ్చిన జింక్స్.. కష్టకాలంలో తన విలువేంటో చాటాడు. శ్రీకర్ భరత్ (5) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరగగా.. శార్దూల్తో కలిసి రహానే ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఆసీస్ పేసర్లు ఎంత పరీక్షించినా.. మొండిగా పోరాడిన ఈ జంట ఒక్కో పరుగు జోడిస్తూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది.
కంగరూలు బాడీ లైన్ బౌలింగ్తో ఇబ్బంది పెట్టిన ఏమాత్రం వెరవని జంట సునాయాసంగా పరుగులు రాబట్టింది. ఏడో వికెట్కు 109 పరుగులు జోడించిన తర్వాత రహానే వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే లంచ్ అనంతరం రహానే వెనుదిరగగా.. అక్కడి నుంచి 35 పరుగుల తేడాలో భారత్ మిగిలిన వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్కు 173 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469; భారత్ తొలి ఇన్నింగ్స్: 296 (రహానే 89, శార్దూల్ 51; కమిన్స్ 3/83, గ్రీన్ 2/44),
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 123/4 (లబుషేన్ 41 బ్యాటింగ్, స్మిత్ 34; జడేజా 2/25, సిరాజ్ 1/41).