Wriddhiman Saha | భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా అన్ని రకాల క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తనకు చివరిదని ప్రకటించాడు. 40 సంవత్సరాల సాహా టెస్టుల్లో బెస్ట్ వికెట్ కీపర్గా ప్రశంసలు అందుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడింది తక్కువే అయినా.. తన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా క్రికెట్కు రిటైర్మెంట్ చెబుతున్నట్లు ప్రకటించారు. క్రికెట్లో అద్భుతమైన ప్రయాణానానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. సాహా భారత్ తరఫున 40 టెస్టులు ఆడాడు. మూడు సెంచరీల సహాయంతో 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ అనంతరం కీపర్గా సేవలందించాడు.
ధోని, రిషబ్ పంత్లతో కలిసి టీమిండియా కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. చివరిసారిగా వృద్ధిమాన్ సాహా 2021లో న్యూజిలాండ్తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత తప్పుకున్నాడు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత శర్మ, టీమ్ మేనేజ్మెంట్ పంత్కి బ్యాకప్గా కేఎస్ భరత్ను తీసుకోవాలని నిర్ణయించింది. క్రికెట్లో చిరస్మరణీయ ప్రయాణం తర్వాత ఈ రంజీ సీజన్ తనకు చివరిదని.. బెంగాల్కు ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా ఉందన్నారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. వచ్చే ఏడాది ఐపీఎల్లో సైతం వృద్ధిమాన్ సాహా కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. గుజరాత్ టైటాన్స్ అతన్ని రీటైన్ చేసుకోకూడదని నిర్ణయించుకుంది.
సాహా 2008 నుంచి ఐపీఎల్లో ఆడుతూ వస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 170 మ్యాచుల్లో 127.57 స్ట్రయిక్ రేట్తో 2934 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరఫున తొమ్మిది వన్డేలు ఆడాడు. 13.67 సగటుతో 41 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బెంగాల్కు 15 సంవత్సరాలు ప్రాతినిథ్యం వహించాడు. సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధికారితో వివాదం కారణంగా సాహా తాత్కాలికంగా బెంగాల్ వదిలి టీమ్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. రెండేళ్లు త్రిపుర తరఫున ఆడాడు. గత సీజన్లో మళ్లీ బెంగాల్ జట్టులో చేరాడు. మాజీ బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ చొరవతో చివరి సీజన్ కోసం బెంగాల్ జట్టులోకి తిరిగి వచ్చాడు.