న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా మళ్లీ టాప్ రెజ్లర్లు ఢిల్లీలో నిరసన(Wrestlers Protest) ప్రదర్శన మొదలుపెట్టారు. అథ్లెట్లను వేధిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఓ సారి ధర్నా చేసిన రెజ్లర్లు.. అప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఈసారి రాజకీయ బలం కోసం ఆ రెజ్లర్లు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఏదైనా తమ నిరసనలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నామని రెజ్లర్లు తెలిపారు.
ఏడాది ఆరంభంలో నిరసన చేపట్టిన రెజ్లర్లు .. ప్రభుత్వ హామీతో తమ ఆందోళన విరమించారు. ఈసారి మాత్రం ఎవర్నీ గుడ్డిగా నమ్మేది లేదని, గతంలో తమను తప్పుదోవ పట్టించారని వినేశ్ పోగట్ అన్నారు. ఈసారి చేపడుతున్న నిరసన ప్రదర్శనకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు ఒలింపిక్ మెడలిస్టు భజరంగ్ పూనియా తెలిపారు. తాము మాత్రం ఏ పార్టీకి అనుబంధం కాదన్నారు.
బ్రిజ్ భూషణ్పై ఏడు మంది మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కన్నాట్ ప్లేస్ పోలీసు స్టేషన్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర క్రీడాశాఖ ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టు కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.