న్యూఢిల్లీ: హత్య కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉంటున్న రెజ్లర్ సుశీల్కుమార్ తాజాగా మరో డిమాండ్ చేశాడు. ఆ మధ్య తనకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాలని కోరిన అతడు.. ఇప్పుడు సెల్లో ఓ టీవీ పెట్టించాలని అడుగుతున్నాడు. వార్తలు చూడటానికి తనకు టీవీ కావాలని అతను అడగడం విశేషం. రెజ్లింగ్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి తనకు టీవీ తప్పనిసరి అని జైలు అధికారులకు రాసిన లేఖలో సుశీల్ అన్నాడు. రెండుసార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన సుశీల్.. రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం అత్యధిక భద్రత ఉండే తీహార్లోని జైల్ నంబర్ 2లో సుశీల్ ఉంటున్నాడు. అతనికి జైలు నిబంధనల ప్రకారం న్యూస్ పేపర్స్ మాత్రం ఇస్తున్నారు. ఇంతకుముందు అతడు ప్రత్యేక ఆహారం కావాలని వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. అవి అంతగా అవసరం లేదంటూ కోర్టు అతని డిమాండ్ను తోసిపుచ్చింది.