చండీగఢ్: తాను క్షేమంగానే ఉన్నానని రెజ్లర్ నిషా దహియా తెలిపారు. తుపాకీ కాల్పుల్లో తాను మరణించినట్లుగా వచ్చిన వార్తలు ఫేక్ అని అన్నారు. సీనియర్ నేషనల్స్ ఆడేందుకు గోండాకు వచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ మేరకు నిషా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.
కాగా, రెజ్లర్ నిషా దహియా, ఆమె సోదరుడు సూరజ్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరుపగా వారిద్దరూ చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. హర్యానా సోనేపట్లోని హలాల్పూర్లో సుశీల్ కుమార్ అకాడమీలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
శుక్రవారం సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగిన రెజ్లింగ్ అండర్ 23 ప్రపంచ ఛాంపియన్షిప్లో నిషా దహియా 65 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలిచారు. ఇతర మహిళా రెజ్లర్లతో కలిసి అద్భుతంగా ప్రతిభ చూపిన ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.