WPL Final 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో, ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 రన్స్ చేసింది. ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ మేగ్ లానింగ్ (35), మరినే కాప్ (18) మాత్రమే రాణించారు. ఒక దశలో ఆ జట్టు 80 రన్స్ లోపే ఆలౌట్ అవుతుందనిపించింది.
కానీ, చివర్లో రాధా యాదవ్(27), శిఖా పాండే (27) బ్యాట్ ఝులిపించడంతో పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. ధాటిగా ఆడిన శిఖా, రాధ స్కోర్ వంద దాటించారు. అంతేకాదు పదో వికెట్కు ఏకంగా 52 రన్స్ కొట్టారు. ముంబై బౌలర్లలో ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. మేలియా కేర్ రెండు వికెట్లు తీసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ను ఇసీ వాంగ్ దెబ్బకొట్టింది. తన మొదటి ఓవర్లోనే లో ఫుల్ టాస్ బంతులతో కీలకమైన ఓపెనర్ షఫాలీ వర్మ(11), అలిసే క్యాప్సే(0)లను ఔట్ చేసింది. దాంతో, 12 పరుగులకే ఢిల్లీ ప్రధాన వికెట్లు కోల్పోయింది. లానింగ్, జెమీమా మూడో వికెట్కు 23 రన్స్ జోడించారు. అయితే.. 35 రన్స్ వద్ద జెమీమా రోడ్రిగ్స్ (9)ను వాంగ్ పెవిలియన్ పంపింది. ఆ తర్వాత మరినే కాప్ (18)తో కలిసి లానింగ్ స్కోర్ బోర్డును నడిపించింది. మరినే ఔటయ్యాక ఆ జట్టు ఆలౌట్ ప్రమాదంలో పడింది. వెంట వెంటనే జెస్ జొనాసెన్ (2), అరుంధతి రెడ్డి, మున్ని మని వికెట్లు పడ్డాయి.
ఆఖర్లో శిఖా పాండే , రాధా యాదవ్ చెలరేగారు. వాంగ్ వేసిన 19వ ఓవర్లో శిఖా వరుసగా ఒక సిక్స్, రెండు బౌండరీలు కొట్టింది. ఆ తర్వాత రాధ ఒక ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. బ్రంట్ వేసిన 20వ ఓవర్లో రాధ రెండు సిక్స్లు బాదడంతో 16 పరుగులు వచ్చాయి. వీళ్లిద్దరు ఆఖరి వికెట్కు 52 రన్స్ జోడించారు. ధాటిగా ఆడిన శిఖ, రాధ 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది.