WPL 2024, DC vs MI | ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో రెచ్చిపోయింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి మెగ్ లానింగ్ (38 బంతుల్లో 53, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించగా జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 69 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టింది. ముంబై బౌలర్లు ఆది నుంచే వికెట్లు తీయలేకపోగా భారీగా పరుగలిచ్చారు.
లానింగ్ ఫిఫ్టీ..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీకి విధ్వంసక బ్యాటర్ షఫాలీ వర్మ ఎప్పటిలాగే దంచికొట్టింది. 12 బంతులే ఆడిన షఫాలీ.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదింది. దీంతో ఢిల్లీ స్కోరు 5 ఓవర్లకే 50 పరుగులకు చేరింది. అలీస్ క్యాప్సీ (19) మూడు బౌండరీలు కొట్టినా ఎక్కువసేపు క్రీజులో నిలువకపోయింది. షఫాలీ, క్యాప్సీ నిష్క్రమించినా లానింగ్.. అమెలియా కెర్ వేసిన రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదింది. ఈ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. మరుసటి ఓవర్లో లానింగ్.. బౌండరీతో 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసింది. కానీ హాఫ్ సెంచరీ చేశాక వెంటనే లానింగ్ పెవిలియన్కు చేరింది.
రోడ్రిగ్స్ బాదుడు..
షబ్నిమ్ ఇస్మాయిల్ వేసిన 16 వ ఓవర్లో రోడ్రిగ్స్ రెండు ఫోర్లు కొట్టింది. తర్వాత ఓవర్లో కూడా రోడ్రిగ్స్ అదే సీన్ రిపీట్ చేసింది. సైకా ఇషాక్ వేసిన 18వ ఓవర్లోనూ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదిన ఆమె.. నటాలీ సీవర్ బ్రంట్ వేసిన 19వ ఓవర్లో 4, 6, 6 తో 27 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసింది.