పారిస్: ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6-2, 5-7, 6-4తో అన్సీడెడ్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. దీంతో వరుసగా రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్.. ఓవరాల్గా నాలుగో గ్రాండ్స్లామ్ ఖాతాలో వేసుకుంది. గతంలో స్వియాటెక్ 2020, 2022లో ఇక్కడ విజేతగా నిలిచింది.
2 గంటల 46 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో ఇరువురు ప్లేయర్లు ప్రతీ పాయింట్ కోసం ప్రాణం పెట్టి పోరాడారు. తొలి సెట్ను సునాయాసంగానే నెగ్గిన స్వియాటెక్కు.. రెండో సెట్లో ముచోవా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన ముచోవా.. చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది. ఒత్తిడిని చిత్తు చేస్తూ కీలక పాయింట్లు నెగ్గిన స్వియాటెక్ చాంపియన్గా అవతరించింది.
జొకోవిచ్ X రూడ్
పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం ఆదివారం నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్తో మూడో సీడ్ నొవాక్ జొకోవిచ్ తలపడనున్నాడు.