World Cup | వన్డే ప్రపంచ కప్కు ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. అక్టోబర్లో మెగా టోర్నీ ప్రారంభంకానున్నది. టోర్నీకి సంబంధించిన షెడ్యూల్పై బీసీసీఐ కసరత్తు చేస్తుండగా.. త్వరలోనే ప్రకటించనున్నది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ ముగిసిన వెంటనే బీసీసీ షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు టోర్నీ కొనసాగనుండగా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ రెండు జట్లు చివరిసారిగా 2019 లార్డ్స్లో ఫైనల్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.
వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నది. అలాగే ఫైనల్ మ్యాచ్ సైతం అదే స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే తొలి మ్యాచ్ను చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే అవకాశాలున్నాయి. ఇక అభిమానులు భారత్ – పాక్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటారు. భారత్తో పాటు పాక్లోనూ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇక దాయాదుల మధ్య పోరు కోసం అక్టోబర్ 15న జరుగనున్నట్లు తెలుస్తున్నది. అయితే, పాక్ ప్రపంచకప్ సందర్భంగా భారత్లో పర్యటించేందుకు అంగీకరించింది. అయితే, షెడ్యూల్పై పలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నది. అహ్మదాబాద్లో భారత్తో ఆడే విషయంలో పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. పాక్ ఆడే పలు వేదికల్లో మార్పులు చేయాలని పీసీబీ చైర్మన్ నజామ్ సేథి కోరుతున్నారు. అయితే, పాక్ జట్టు టైటిల్ పోరులో ఫైనల్కు చేరితే అహ్మదాబాద్లో ఆడేందుకు అంగీకరించినట్లుగా సమాచారం.
ఇప్పటి వరకు సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం.. అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో మాత్రమే పాక్ ఆడనున్నట్లు తెలుస్తున్నది. పాక్ వివిధ జట్లతో ఆడే మ్యాచ్లకు ఎక్కువగా దక్షిణ భారత దేశంలోనే వేదికలను సిద్ధం చేసినట్లుగా సమాచారం. దాంతో పాటు కోల్కతా, ఢిల్లీ, ఇండోర్, ధర్మశాల, గౌహతి, రాజ్కోట్, రాయ్పూర్, ముంబయిలోని పలు స్టేడియాలను సైతం షార్ట్లిస్ట్ చేసినట్లుగా తెలుస్తున్నది. అయితే, మొహలీ, నాగ్పూర్లను మాత్రం జాబితాను తొలగించినట్లు తెలుస్తున్నది.
వన్డే ప్రపంచ కప్ సందర్భంగా భారత్లోని అన్ని స్టేడియాల్లో మ్యాచ్లు జరుగనున్నట్లు తెలుస్తున్నది. టోర్నీలో ఒక్కో స్టేడియంలో కనీసం ఒక్కో మ్యాచ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ఐసీసీ మెగా టోర్నీలో అన్ని జట్లు తలా తొమ్మిది లీగ్ మ్యాచ్లు ఆడనున్నాయి. టోర్నీలో మొత్తం 10 జట్ల మధ్య 48 మ్యాచ్లు జరుగనున్నాయి. ఆతిథ్య భారత్తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా టోర్నీలో పాల్గొనున్నాయి. ఈ ఎనిమిది జట్లు టోర్నీకి అర్హత సాధించాయి. ఇక చివరి రెండు స్థానాల కోసం జింబాబ్వేలో జూన్-జులైలో టోర్నీ నిర్వహించనున్నారు. ఇందులో మాజీ చాంఫియన్లు వెస్టిండిస్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, నేపాల్, ఒమన్, స్కాట్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆతిథ్య జింబాబ్వే తలపడనున్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వన్డే ప్రపంచ కప్కు అర్హత సాధించనున్నాయి.