అల్మాటీ(కజకిస్థాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్లో భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపీ రజత పతకం కైవసం చేసుకుంది. శుక్రవారం మహిళల చివరి రౌండ్లో హోంగ్యీ టాన్పై నెగ్గిన హంపీ 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి తొమ్మిది రౌండ్లలో నాలుగు విజయాలు ఖాతాలో వేసుకున్న హంపీ.. చివరి ఎనిమిది రౌండ్ల్లో ఏడింట నెగ్గి.. హారికతో జరిగిన పోరును ‘డ్రా’ చేసుకుంది. ‘బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్లో తొలిసారి రజతం నెగ్గడం సంతోషంగా ఉంది.
ఎనిమిది రౌండ్లలో ఏడింట్లో విజయం సాధిస్తానని అనుకోలేదు’ అని హంపీ ట్వీట్ చేసింది. మహిళల విభాగంలో కజకిస్థాన్కు చెందిన బిబిసారా బాలబయేవా (13 పాయింట్లు) స్వర్ణం చేజక్కించుకోగా.. పురుషుల ఈవెంట్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (16 పాయింట్లు) టైటిల్ గెలుచుకున్నాడు. పురుషుల విభాగంలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి 42వ స్థానంలో నిలువగా.. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారికకు 13వ ప్లేస్ దక్కింది.