మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు రెండో మ్యాచ్ ఓడింది. తొలి మ్యాచ్లో పాక్ను మట్టికరిపించిన భారత జట్టు రెండో మ్యాచ్లో న్యూజిల్యాండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత వెస్టిండీస్ను చిత్తు చేసి, నాలుగో మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగింది. ఈ మ్యాచ్లో భారత ప్రత్యర్థి ఇప్పటి వరకు టోర్నీలో విజయం రుచిచూడని ఇంగ్లండ్. దీంతో భారత గెలుపు ఖాయమని అంతా భావించారు.
కానీ అనూహ్యంగా ఈ మ్యాచ్లో ఇంగ్లిష్ మహిళలు జయభేరి మోగించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. చార్లీ డీన్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో 36.2 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ స్మృతి మంధాన (35) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో యాస్తికా భాటియా (8), కెప్టెన్ మిథాలీ రాజ్ (1), దీప్తి శర్మ (0), హర్మన్ప్రీత్ కౌర్ (14), స్నేహ్ రాణా (0), రిచా ఘోష్ (33), పూజా వస్త్రాకర్ (6), ఝులన్ గోస్వామి (20), మేఘనా సింగ్ (3), రాజేశ్వరి గైక్వాడ్ (1 నాటౌట్) పరుగులు చేశారు.
స్వల్పలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టును మేఘనా సింగ్ ఆదిలోనే దెబ్బ కొట్టింది. ఓపెనర్ దాన్ని వ్యాట్ (1)ను పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత కాసేపటికే ఝులన్ గోస్వామి.. మరో ఓపెనర్ టామీ బ్యూమౌట్ (1)ను అవుట్ చేసింది. కానీ కెప్టెన్ హెదర్ నైట్ (53 నాటౌట్) జట్టుకు అండగా నిలిచింది. ఆమెతోపాటు నాట్ స్కివర్ (45), రాణించడంతో ఇంగ్లండ్ జట్టు లక్ష్యం దిశగా సాగింది.
అయితే స్కివర్ను వస్త్రాకర్, ఆ తర్వాత కాసేపటికే అమీ జోన్స్ను గైక్వాడ్ అవుట్ చేశారు. చివర్లో మేఘనా సింగ్ ఒకే ఓవర్లో సోఫియా డంక్లీ (17), క్యాథరీన్ బ్రంట్ (0)ను అవుట్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివర్లో సోఫీ ఎక్సెల్టోన్ (5 నాటౌట్)తో కలిసి నైట్ మ్యాచ్ ముగించింది. ఇంగ్లండ్ జట్టు 31.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇది ఈ టోర్నీలో ఇంగ్లండ్కు తొలి విజయం కావడం గమనార్హం. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది.
That's that from the #ENGvIND game.
England win by 4 wickets.
Scorecard – https://t.co/cpWXApZ2Wt #ENGvIND #CWC22 pic.twitter.com/rSlMxy8ec6
— BCCI Women (@BCCIWomen) March 16, 2022