మహిళల వన్డే ప్రపంచకప్
మౌంట్మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్లో ఆదివారం పాకిస్థాన్తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన మిథాలీరాజ్ బృందం ఈసారి కప్పు కొట్టాలని తహతహలాడుతున్నది. ఏ స్థాయి క్రికెట్లోనైనా భారత్, పాక్ మ్యాచ్ అంటే ఆసక్తి రేకెత్తడం సహజం కాగా.. వరల్డ్కప్ కావడం మరింత జోష్ నింపుతున్నది. స్మృతి మందన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, కెప్టెన్ మిథాలీ రాజ్తో కూడిన భారత బ్యాటింగ్ బృందం సమిష్టిగా సత్తాచాటితే భారీ స్కోరు ఖాయమే. బౌలింగ్లో జులన్ గోస్వామి, పూనమ్, దీప్తి శర్మ, రాజేశ్వరి కీలకం కానున్నారు. మహిళల క్రికెట్లో మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఆరో ప్రపంచకప్ ఆడుతున్న మిథాలీరాజ్ ఈసారైనా తన కల నెరవేర్చుకోవాలని చూస్తున్నది. మెగాటోర్నీ ఆరంభానికి దాదాపు నెలన్నర ముందే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. కివీస్తో వన్డే సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. వామప్ మ్యాచ్ల్లో ఇరగదీసింది. మరోవైపు టోర్నీలో ఆడుతున్న ఎనిమిది జట్లలో అందరికంటే తక్కువ ర్యాంక్లో ఉన్న పాకిస్థాన్.. మిథాలీ బృందాన్ని ఎలా నిలువరిస్తుందో చూడాలి! లీగ్ దశలో శనివారం జరిగిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా విజయాలు సాధించాయి. ఇంగ్లండ్తో జరిగిన పోరులో ఆసీస్ 12 పరుగుల తేడాతో గెలుపొందగా.. దక్షిణాఫ్రికా 32 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుచేసింది.