న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై, సాక్షి చౌదరి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన 75కిలోల ప్రిక్వార్టర్స్ బౌట్లో లవ్లీనా 5-0 తేడాతో మెక్సికో బాక్సర్ వెనెస్సా ఒర్టిజ్పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ అస్సాం బాక్సర్ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పవర్ఫుల్ పంచ్లతో విరుచుకుపడింది. తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ ఒర్టిజ్పై వ్యూహాత్మకంగా పంచ్లు విసిరి పైచేయి సాధించింది. ఒక దశలో లవ్లీనా విసిరిన పంచ్లు సరిగ్గా కుదరకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడింది. మరోవైపు 54 కిలోల విభాగంలో సాక్షి ..జజిరా ఉర్కబయేవా(కజకిస్థాన్)పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. అనూహ్య రీతిలో జట్టులో చోటు దక్కించుకున్న ప్రీతి(54కి) 3-4 తేడాతోజింట్పాంగ్ జుటామస్(థాయ్లాండ్) చేతిలో పోరాడి ఓడింది. మంగళవారం జరిగే ప్రిక్వార్టర్స్ బౌట్లలో నిఖత్ జరీన్తో పాటు నీతూ, మనీశ, సాక్షి చోప్రా, జాస్మిన్, మంజు బరిలోకి దిగనున్నారు.