Narendra Shah : భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రానా(Sneh Rana) కోచ్ నరేంద్ర షా(Narendra Shah)పై లైగింక వేధింపుల కేసు నమోదు అయింది. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్టు ఆడియో ఆధారం లభించడంతో అతడిపై ఉత్తరాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆడియో లీక్ విషయం తెలియగానే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చమోలి జిల్లాకు చెందిన మైనర్ అమ్మాయి (Minor Girl) చదువుకుంటూనే డెహ్రడూన్(Dehradun)లో క్రికెట్ శిక్షణ తీసుకుంటోంది. ఆమెతో నరేంద్ర అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ అమ్మాయితో ఫోన్లో అతను అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో వైరల్ కావడంతో అతడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బుక్ చేశామని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ లోకేంద్ర బహుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన వెల్లడించాడు.
ప్రస్తుతం స్నేహ్ రానా(Sneh Rana)కు కోచ్గా ఉన్న నరేంద్ర ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై కేసు నమోదు కావడంతో ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (UCA) అతడిని మహిళా క్రికెట్ కో -కన్వీనర్ పదవి నుంచి తొలగించింది. ఈమధ్యే ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL) తొలి సీజన్లో రానా గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)కు ఆడింది. తొలి మ్యాచ్లో గాయపడిన కెప్టెన్ బేత్ మూనీ టోర్నీ మొత్తానికి దూరం కావడంతో యాజమాన్యం ఆమెకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే.. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్కు చేరలేదు. టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. నాట్ స్కీవర్ బ్రంట్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు తొలి సీజన్ చాంపియన్గా అవతరించింది.