బెంగళూరును గెలిపించిన శ్రీకర్ఆఖరి బంతికి సిక్సర్
చివరి పోరులో ఢిల్లీ ఓటమి
165 పరుగుల లక్ష్యఛేదనలో 6 పరుగులకే ఓపెనర్లు ఔటైనా.. తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ విజృంభించడంతో బెంగళూరు ఆఖరి పోరులో నెగ్గింది. ఢిల్లీపై నెగ్గాలంటే చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన దశలో భరత్ భారీ సిక్సర్ బాది కోహ్లీ సేనను గెలిపించాడు. ఈ విజయంతో బెంగళూరు.. చెన్నైతో సమంగా 18 పాయింట్లు ఖాతాలో వేసుకున్నా.. మెరుగైన రన్రేట్ కారణంగా ధోనీ సేన రెండో స్థానంలో నిలువగా.. బెంగళూరు మూడో ప్లేస్తో లీగ్ దశను ముగించింది! ఆదివారం జరుగనున్న తొలి క్వాలిఫయర్లో చెన్నైతో ఢిల్లీ తలపడనుండగా.. సోమవారం ఎలిమినేటర్లో కోల్కతాతో బెంగళూరు
అమీతుమీ తేల్చుకోనుంది!
దుబాయ్: ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకున్న జట్ల మధ్య జరిగిన పోరులో బెంగళూరుదే పైచేయి అయింది. తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ (52 బంతుల్లో 78; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో శుక్రవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధవన్ (43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు సరిగ్గా 20 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 166 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’శ్రీకర్ భరత్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్ (33 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (4), దేవదత్ పడిక్కల్ (0) విఫలమైనా.. భరత్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలువడంతో పాటు ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో భారీ సిక్సర్తో బెంగళూరుకు విజయాన్నందించాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు పడగొట్టాడు.
ఢిల్లీ: పృథ్వీ షా (సి) గార్టన్ (బి) చాహల్ 48, ధవన్ (సి) క్రిస్టియాన్ (బి) హర్షల్ 43, పంత్ (సి) భరత్ (బి) క్రిస్టియాన్ 10, శ్రేయాస్ (సి) క్రిస్టియాన్ (బి) సిరాజ్ 18, హెట్మైర్ (సి) కోహ్లీ (బి) సిరాజ్ 29, రిపాల్ (నాటౌట్) 7, ఎక్స్ట్రాలు: 9, మొత్తం: 164/5. వికెట్ల పతనం: 1-88, 2-101, 3-108, 4-143, 5-164, బౌలింగ్: మ్యాక్స్వెల్ 3-0-29-0, సిరాజ్ 4-0-25-2, గార్టన్ 3-0-20-0, చాహల్ 4-0-34-1, హర్షల్ 4-0-34-1, క్రిస్టియాన్ 2-0-19-1.
బెంగళూరు: కోహ్లీ (సి) రబడ (బి) నోర్జే 4, పడిక్కల్ (సి) అశ్విన్ (బి) నోర్జే 0, భరత్ (నాటౌట్) 78, డివిలియర్స్ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 26, మ్యాక్స్వెల్ (నాటౌట్) 51, ఎక్స్ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 166/3. వికెట్ల పతనం: 1-3, 2-6, 3-55, బౌలింగ్: నోర్జే 4-0-24-2, అవేశ్ 4-0-31-0, అక్షర్ 4-0-39-1, రబడ 4-0-37-0; అశ్విన్ 1-0-11-0, రిపాల్ 3-0-22-0.