ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, టీమిండియా యువకెరటం రిషభ్ పంత్ పుట్టిన రోజు సందర్భంగా నెట్టింట్లో అతనిపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. సోమవారం నాడు రిషభ్ పంత్ 24వ ఏట అడుగుపెడుతున్నాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పంత్ ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారధి శ్రేయాస్ అయ్యర్కు గాయం అవడంతో జట్టు సారధ్య బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నాడు. అతని సారధ్యంలో జట్టు అద్భుతంగా రాణిస్తోంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తో సమానంగా పాయింట్లు సాధించింది. సోమవారం పంత్ పుట్టినరోజు నాడు అతని సారధ్యంలోని ఢిల్లీ జట్టు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పంత్పై బర్త్డే విషెస్ కోకొల్లలుగా వస్తున్నాయి. ఐసీసీ, బీసీసీఐ, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ పంత్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చెన్నైపై విజయంతో ఈ పుట్టినరోజును మర్చిపోలేని అనుభూతిగా మార్చుకోవాలని ఆశిస్తూ ఢిల్లీ జట్టు ట్వీట్ చేసింది.