జూబ్లీహిల్స్, జనవరి 22: దేశంలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ తెలిపారు. తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కోట్లవిజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ అంతర్ జిల్లాల తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు ఆదివారం సాట్స్ చైర్మన్ పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్రీడలకు ప్రోత్సాహన్ని అందించేందుకు నూతన క్రీడా పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇప్పటికే దీనిపై సబ్ కమిటీ చేపట్టిన అధ్యయనం పూర్తి కావచ్చిందని.. త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. తైక్వాండో పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 1100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్ గౌడ్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, బాబులాల్, శ్రీధర్రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.