లండన్: బ్రిటన్లో ఇంకా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరో వైపు డెల్టా వేరియంట్ అక్కడ కొంత ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెల చివర్లో వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ప్రారంభంకానున్నది. అయితే వచ్చే నెలలో జరగనున్న వింబుల్డన్ ఫైనల్స్కు మాత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. జూలై 10, 11వ తేదీల్లో జరిగే ఫైనల్ మ్యాచ్లకు స్టేడియం సామర్ధ్యానికి తగినట్లు ప్రేక్షకులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వింబుల్డన్ ఫైనల్స్ మినహా మిగితా మ్యాచ్లకు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. వింబుల్డన్ టోర్నీ ఈ నెల 28వ తేదీన ప్రారంభంకానున్నది. మ్యాచ్లను తిలకించేందుకు ప్రతి రోజు కనీసం 20 వేల మంది ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నారు. సెంటర్ కోర్టులో జరిగే ఫైనల్ మ్యాచ్లకు మాత్రం పూర్తి సామర్థ్యంతో స్టేడియం నిండి ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.
మరో వైపు యూరో 2020 నాకౌట్ మ్యాచ్లకు కూడా ప్రేక్షకులను అనుమతించనున్నారు. నాకౌట్ దశలో వెంబ్లే స్టేడియంలోకి 40 వేల మంది అభిమానులను పర్మిషన్ ఇచ్చారు. రగ్బీ లీగ్స్ చాలెంజ్ కప్ ఫైనల్, సాండ్విచ్లో ఓపెన్ గోల్ఫ్ టోర్నీ, సిల్వర్స్టోన్ గ్రాండ్ ప్రీ టోర్నీలకు కూడా ప్రేక్షకులను అనుమతించనున్నారు.