లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జొకోవిచ్ జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా జొకో టాప్గేర్లో దూసుకెళుతున్నాడు. మంగళవారం మూడున్నర గంటల పాటు జరిగిన క్వార్టర్స్ పోరులో టాప్సీడ్ జొకోవిచ్ 5-7, 2-6, 6-3, 6-2, 6-2 తేడాతో జానిక్ సిన్నర్(ఇటలీ)పై అద్భుత విజయం సాధించాడు.
నువ్వానేనా అన్నట్లు ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో జొకో తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ పైచేయి సాధించాడు. మ్యాచ్లో తొలి రెండు సెట్లను చేజార్చుకుని వెనుకంజలో నిలిచిన జొకో..మూడో సెట్ నుంచి విశ్వరూపం ప్రదర్శించాడు. మ్యాచ్ మొత్తమ్మీద ఎనిమిది ఏస్లు సంధించిన ఈ సెర్బియా వీరుడు ఐదుసార్లు అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో మారియా 4-6, 6-2, 7-5తో నేమియర్పై గెలిచి ముందంజ వేసింది.
సెమీస్లో సానియా జోడీ
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వింబుల్డన్ గ్రాండ్స్లామ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-మ్యాట్ పవిచ్ జోడీ 6-4, 3-6, 7-5తో నాలుగో సీడ్ గాబ్రెల్లా డబ్రోస్కీ -జాన్ పీర్స్ ద్వయంపై గెలిచింది.