చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. ఈ సారి ఐపీఎల్ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్.. చెపాక్లో హైదరాబాద్తో మ్యాచ్ జరిగిన సమయంలో స్టేడియంలో ఆటగాళ్లతో కలిసి తిరిగాడు. చివరిసారి అతను జట్టుకు ఆడుతాడేమో అన్న అనుమానాలు తొలుత వ్యక్తం అయ్యాయి. కానీ ధోనీ ఓ ప్లేయర్గా గ్రౌండ్లోకి దిగలేదు. గాయం కారణంగా అతను ఈసారి టోర్నీలోని అన్ని మ్యాచ్లకు దూరం అయ్యాడు. చెన్నై జట్టుకు ఇంకా ఒక్కటే మ్యాచ్ ఉంది. ప్లే ఆఫ్స్లో ఎంట్రీ కోసం కచ్చితంగా ఆ మ్యాచ్ను గెలవాల్సి ఉంటుంది. గెలిచినా.. ప్లే ఆఫ్స్ బర్త్ దక్కడం సులువుగా లేదు. అయితే ధోనీ ఇక ఐపీఎల్ ప్లేయర్గా తన పాత్రను ముగించేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ధోనీతో కలిసి ఆడిన కామెంటేటర్ సురేశ్ రైనా, చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ధోనీతో మాట్లాడిన వివరాలను సురేశ్ రైనా ఇటీవల వెల్లడించాడు. రైనా చెప్పిన విషయం వింటే ధోనీ అభిమానులు గుండె పగలడం ఖాయమే అవుతుంది. ఎలాగో 2026 సీజన్లో మ్యాచ్లు ఆడలేదు కాబట్టి, ఈ సీజన్ లెక్కలోకి రాదు అని, వచ్చే ఏడాది అయినా ఐపీఎల్ ఆడాలని ధోనీని కోరినట్లు రైనా చెప్పాడు. అయితే శరీరం సహకరించడం లేదని, కొంత బలం తగ్గినట్లు ధోనీ తనకు జవాబు ఇచ్చాడని రైనా తెలిపాడు. ధోనీ తన రిటైర్మెంట్పై వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు రైనా చెప్పాడు. శరీరం సహకరించడం లేదని ధోనీ చెప్పడం వల్ల అతను వచ్చే సీజన్లో ఆడేది అనుమానంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
ఇక సోమవారం హైదరాబాద్తో మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడారు. ధోనీ భవిష్యత్తు గురించి ఆయన ఓ కామెంట్ చేశారు. ధోనీ భవిష్యత్తుపై మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ధోనీ గురించి విస్తృతంగా చర్చ జరుగుతుందన్న విషయం తెలుసు అని, కానీ యువ ఆటగాళ్లకు అతని అనుభవం అవసరం అవుతుందని, ఈసారి అతను ఆడలేదు కానీ, జట్టుపై ధోనీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఫ్లెమింగ్ తెలిపారు. జట్టులో ఎన్నో మంచి మార్పులు జరిగాయని, కొత్త ఆటగాళ్లను ప్రవేశపెట్టామని, కానీ ఫలితాల ఆధారంగానే అందర్నీ అంచనా వేస్తున్నారని, అది సరైంది కాదు అని, ధోనీ అంశంలో మేనేజ్మెంట్ నిర్ణయమే ఫైనల్ అని ఫ్లెమింగ్ చెప్పారు.