టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి చెక్ పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు అతడి ప్రదర్శన కూడా నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. దీంతో అతడిని టీ20ల నుంచి తప్పించేందుకు కూడా ప్రయత్నాలు జోరందుకున్నాయని సమాచారం. ఇంగ్లండ్ తో జరుగబోయే మిగిలిన రెండు టీ20లలో బాగా ఆడితేనే విరాట్ జట్టులో ఉంటాడు. లేకుంటే వేటు తప్పదని తెలుస్తున్నది.
వన్ డౌన్ లో వచ్చే కోహ్లీకి దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్నది. టీ20 ప్రపంచకప్-2022 ముందున్న నేపథ్యంలో సెలక్టర్లు తుది జట్టును రెడీ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లి వరుసగా విఫలమవుతుండటంతో అతడికి ఇంగ్లండ్ సిరీస్ కీలకం కానున్నది.
కోహ్లీ స్థానానికి దీపక్ హుడా చెక్ పెట్టబోతున్నాడు. గత కొద్దిరోజులుగా ఈ కుర్రాడు తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటున్నాడు. గడిచిన ఐదు ఇన్నింగ్స్ లలో దీపక్ హుడా.. 45, 47 నాటౌట్, 104, 59, 33 పరుగులతో నిలకడగా రాణిస్తున్నాడు. జట్టు అవసరాన్ని బట్టి బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. సూర్యకుమార్ కూడా తక్కువేమీ తినడం లేదు. ఇదిలాఉండగా కోహ్లి మాత్రం కనీసం క్రీజులో నిలదొక్కుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-15లో అతడి వైఫల్యం సాగిన తీరు కోహ్లీ అభిమానులను సైతం నిరాశపరిచింది.
హుడా, సూర్యకుమార్ లు చెలరేగుతుండటంతో కోహ్లీకి రాబోయే రెండు టీ20లు కీలకం కానున్నాయి. ఈ మ్యాచ్ లలో గనక కోహ్లీ విఫలమైతే అతడు త్వరలో జరుగబోయే వెస్టిండీస్ సిరీస్ తో పాటు ఆసియా కప్ లో కూడా ఆడేది అనుమానమే.. మరి శని, ఆది వారాల్లో జరిగే మిగిలిన రెండు టీ20లలో కోహ్లీ ఆడే ఆట అతడి టీ20 భవిష్యత్ ను నిర్ణయించేదిగా మారింది.