WFI: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్ హక్ కమిటీ నిర్వహించే పోటీలతో సంబంధం లేకుండా న్యాయబద్ధంగా ఎన్నికైన తామే నేషనల్ ఛాంపియన్స్ నిర్వహిస్తామని చెప్పిన సంజయ్ సింగ్ ప్యానెల్కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. గత నెల 21న సంజయ్ సింగ్ ప్యానెల్.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలలో ఘనవిజయం సాధించినా తమకు సమాచారం ఇవ్వకుండానే అండర్ -20 రెజ్లింగ్ ఈవెంట్ నిర్వహిస్తామని ప్రకటన చేసినందుకు గాను నిబంధనల ఉల్లంఘించారనే కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. సంజయ్ ప్యానెల్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. తదనంతరం భూపీందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని అడ్హక్ కమిటీ, ఫిబ్రవరిలో రాజస్తాన్ వేదికగా సీనియర్ రెజ్లింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని ప్రకటించగా.. వాటికి తాము సహకరించబోమని, తామే సొంతంగా నేషనల్స్ నిర్వహిస్తామని సంజయ్ సింగ్ చెప్పడం వివాదానికి దారితీసింది.
జనవరి మాసాంతం (29-31)లో పూణెలో సీనియర్ నేషనల్స్ నిర్వహిస్తామని సంజయ్ సింగ్ ప్యానెల్ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ మినిస్ట్రీ స్పందిస్తూ.. ‘06-01-2024లో మీరు (సంజయ్ సింగ్ ప్యానెల్) పూణెలో జనవరి 29-31 మధ్య నిర్వహించతలపెట్టిన సీనియర్ నేషనల్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించేందుకు గాను డబ్ల్యూఎఫ్ఐ లెటర్ హెడ్తో విడుదల చేసిన ప్రకటన మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే స్పోర్ట్స్ మినిస్ట్రీ గతనెలలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీకు గానీ డబ్ల్యూఎఫ్ఐకి గానీ ఇలాంటి ఈవెంట్స్ను నిర్వహించే అర్హత లేదు. దీనిని మీరు తక్షణమే నిలిపివేయాలి. అలా కాకుండా మీరు డబ్ల్యూఎఫ్ఐ లెటర్ హెడ్స్, పేరు, లోగో, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ను వాడితే అది నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుంది…
అలా కాకుండా మీరు గనక ఎలాంటి ఛాంపియన్షిప్స్ను నిర్వహించినా దానిని మేం గుర్తించబోం.. అంతేగాక ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనేవారికి ఇచ్చిన సర్టిఫికెట్లనూ మేం పరిగణనలోకి తీసుకోబోం. ప్రభుత్వ ఉద్యోగాలలో, స్కూల్స్, కాలేజీలలో, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగానికి కూడా వాళ్లు అర్హులు కాదు..’ అని లేఖలో పేర్కొంది. అంతేగాక ‘తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అడ్హక్ కమిటీ దేశంలో రెజ్లింగ్ వ్యవహారాలను చూసుకుంటుంది…’ అని లేఖలో సూచించింది. అడ్హక్ కమిటీ వచ్చే నెల 2 నుంచి 5 దాకా జైపూర్లో సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.