దుబాయ్: రెండు సార్లు టీ20 ప్రపంచకప్ను ముద్దాడిన విండీస్ జట్టుకు ఈ టీ20 ప్రపంచకప్ కలిసిరావడం లేదు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఈ జట్టు ఘోరంగా ఓడిపోయింది. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్కు పెట్టింది పేరైన వెస్టిండీస్ జట్టు తొలి మ్యాచ్లో ఇంగ్లండ్పై కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇప్పుడు సౌతాఫ్రికా చేతులో కూడా 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టులో ఎల్విన్ లూయిస్ (56), కీరన్ పొలార్డ్ (26) మాత్రమే రాణించారు. లెండిల్ సిమన్స్ (35 బంతుల్లో 16) టెస్టు మ్యాచ్ను తలపించే బ్యాటింగ్ చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలం అవడంతో విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఛేజింగ్లో దక్షిణాఫ్రికా జట్టుకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ బవుమా (2) రనౌట్గా వెనుతిరిగాడు. అయితే మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (39), వాన్ డర్ డస్సెన్ (43 నాటౌట్), మార్క్రమ్ (51 నాటౌట్) ధాటిగా ఆడటంతో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. విండీస్ బౌలర్లలో అకియల్ హుస్సేన్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా మార్క్రమ్ రెచ్చిపోయి ఆడాడు.
కేవలం 25 బంతుల్లోనే అతను అర్థశతకం సాధించాడు. మరోపక్క డర్ డస్సెన్ చాలా నిలకడగా ఆడుతూ అతనికి మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ 83 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. 19వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ కొట్టి, మరుసటి బంతికి సింగిల్తో జట్టుకు కావలసిన విన్నింగ్ రన్స్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో మరో పది బంతులు మిగిలుండగానే సౌతాఫ్రికా విజయం సాధించింది.