IND vs WI | ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే కప్పు కైవసం చేసుకునేందుకు రెడీ అయింది. తొలి మ్యాచ్లో ఏమాత్రం పోటీనివ్వ లేకపోయిన కరీబియన్లు ఈ సారైనా పోరాడుతారా చూడాలి. మరోవైపు గత మ్యాచ్లో ప్రయోగాలతో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్సేన ఈ సారి పూర్తి బలం, బలగంతో బరిలోకి దిగే చాన్స్ ఉంది!
బార్బడోస్: స్పిన్నర్ల జోరుతో తొలి వన్డేలో అలవోకగా విజయం సాధించిన భారత జట్టు.. శనివారం వెస్టిండీస్తో మరోసారి అమీతుమీకి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో ఉన్న టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే కప్పు చేజిక్కించుకోవాలని చూస్తున్నది. మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నట్లు రోహిత్ శర్మ పేర్కొనగా.. రెండో వన్డేలోనూ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మరోవైపు వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు.. సొంతగడ్డపై కనీస పోరాటంతో పరువు నిలుపుకోవాలని భావిస్తున్నది. గత మ్యాచ్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన విండీస్ 114 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే స్వల్ప లక్ష్యఛేదనలోనూ మనవాళ్లు తడబడటమే మేనేజ్మెంట్ను కలవరపాటుకు గురిచేస్తున్నది.
గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే టీమ్ఇండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోసారి సంజూ శాంసన్కు నిరాశ తప్పకపోవచ్చు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వడంతో మరోసారి ముఖేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్తో కలిసి హార్దిక్ పాండ్యా పేస్ భారాన్ని మోయనున్నాడు. ఇక తొలి పోరులో కరీబియన్లను గింగిరాలు తిప్పిన కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అదే జోరు కొనసాగిస్తే.. విండీస్కు కష్టాలు తప్పకపోవచ్చు. ఎటొచ్చి బ్యాటింగ్ ఆర్డర్తోనే భారత్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టెస్టుల్లో ఓపెనింగ్ స్థానం నుంచి తొలగించినప్పటి నుంచి శుభ్మన్ గిల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండగా.. సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యాలో నిలకడ లోపించింది. వరల్డ్కప్నకు ఎక్కువ సమయం లేకపోవడంతో.. సమస్యలను అధిగమించి ప్లేయర్లంతా సమిష్టిగా సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.
శనివారం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆరంభంలో పేస్కు సహకరించనున్న పిచ్.. ఆ తర్వాత స్పిన్నర్లకు స్వర్గధామంలా మరనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు మరో స్పిన్నర్ను ఆడించే అవకాశాలున్నాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్, పాండ్యా, ఇషాన్, జడేజా, శార్దూల్, కుల్దీప్, ఉమ్రాన్, ముఖేశ్.
వెస్టిండీస్: హోప్ (కెప్టెన్), కింగ్, మయేర్స్, అథనాజె, పావెల్, హెట్మైర్, షెఫర్డ్, డ్రా క్స్, యానిక్, మోటియా, అల్జారీ జెసెఫ్.