షార్జా: ప్రధాన బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్కు క్యూ కట్టిన వేళ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40) సిక్సర్లతో చెలరేగాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి తడబడుతూనే వచ్చింది. మూడో ఓవర్లోనే ఓపెనర్ ఎల్విన్ లూయిస్ (6) అవుటవగా, ఆ తర్వాత కాసేపటికే క్రిస్ గేల్ (4), హెట్మెయర్ (9) కూడా పెవిలియన్ చేరారు.
32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును రోస్టన్ ఛేజ్ (39) ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి సహకారం అందించే వారే కరువయ్యారు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (14) రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగాడు. ఆ తర్వాతి బంతికే ఆండ్రీ రసెల్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ జట్టును ఆదుకున్నాడు.
వచ్చీరావడంతోనే సిక్సర్ల వర్షం కురిపించాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి. ఈ క్రమంలో పూరన్, ఛేజ్ జోడీ అర్థశతక భాగస్వామ్యంతో జట్టు మంచి స్కోరు చేస్తుందనిపించింది. కానీ ఈ జోడీని షోరిఫుల్ ఇస్లామ్ విడదీశాడు. ఇద్దరినీ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే చివరి ఓవర్ తొలి బంతికి డ్వేన్ బ్రావో (1) కూడా ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో సౌమ్య సర్కార్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
అయితే అంతకుముందు క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన జేసన్ హోల్డర్ (15) తర్వాతి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదాడు. బ్రావో అవుటవడంతో మళ్లీ క్రిజులోకి వచ్చిన పొలార్డ్ చివరి బంతికి సిక్సర్ కొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.