పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా చెరో రెండు విజయాలు నమోదు చేసుకొని నేడు బెంగళూరులో ఆఖరి పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
చిన్న బౌండరీల చిన్నస్వామి స్టేడియంలో వర్షం ముప్పు పొంచి ఉన్న మ్యాచ్లో ఎవరు పైచేయి సాధించి.. సిరీస్ పట్టేస్తారో చూడాలి!
బెంగళూరు: సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత.. తిరిగి పుంజుకున్న టీమ్ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడేందుకు రెడీ అయింది. ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని పంత్ సేన చూస్తుంటే.. సమిష్టిగా సత్తాచాటి కప్పు కొట్టేయాలని దక్షిణాఫ్రికా భావిస్తున్నది. బౌలర్లు రాణిస్తున్నా.. టాపార్డర్ నిలకడలేమి టీమ్ఇండియాను కలవరపెడుతున్నది. ఇషాన్ కిషన్ ప్రతీ మ్యాచ్లో ఫర్వాలేదనిపిస్తుండగా.. రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.
ముఖ్యంగా సారథ్య బాధ్యతలు చేపట్టిన పంత్.. పదే పదే పేలవ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడ్డ బంతులకు బలవుతున్న పంత్.. ఆ అలవాటు మార్చుకోకుంటే కష్టమని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇప్పటికే చురకలంటించాడు. టీమ్ఇండియా గత మ్యాచ్ కూర్పుతోనే బరిలోకి దిగనుండగా.. బెంగళూరులో గత రెండు రోజులుగా వర్షం కురుస్తుండటం అభిమానులను కలవరపెడుతున్నది. మరోవైపు తొలి రెండు మ్యాచ్ల్లో రాణించిన దక్షిణాఫ్రికా.. మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ ఓ మాదిరి లక్ష్యఛేదనలో తడబడింది. రాజ్కోట్లో బ్యాటింగ్ చేస్తూ గాయపడి రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన సఫారీ కెప్టెన్ టెంబా బవుమా అందుబాటులో ఉంటాడా లేదా అనేది మ్యాచ్కు ముందు తేలనుంది. ఒకవేళ అతడు కోలుకోకుంటే.. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
డీకేపైనే నజర్
లేటు వయసులో ధాటిగా ఆడుతూ ఆకట్టుకుంటున్న దినేశ్ కార్తీక్ (డీకే)పైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. భారత్ ఆడిన తొలి టీ20 (2006; దక్షిణాఫ్రికాపై)లో సభ్యుడైన కార్తీక్.. గత మ్యాచ్లో ఈ ఫార్మాట్లో తొలి అర్ధ శతకం సాధించడం గమనార్హం. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతున్న కార్తీక్.. ఫీల్డింగ్ ప్లేస్మెంట్లకు అనుగుణంగా షాట్లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. రాజ్కోట్ పోరులో ఆశలే లేని స్థితిలో దినేశ్ విజృంభించడంతోనే టీమ్ఇండియా పోరాడే స్కోరు చేయగా.. అవేశ్ ఖాన్తో పాటు బౌలర్లంతా సమిష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికాపై అతిపెద్ద (82 పరుగుల తేడాతో) విజయం నమోదు చేసుకుంది.
ఎటొచ్చి రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన మేనేజ్మెంట్ను ఇబ్బంది పెడుతున్నది. ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లు అందుబాటులో ఉన్న సమయంలో పంత్ ఇలా విఫలమవడం.. జట్టులో అతడి స్థానానికి ఎసరు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషబ్ చివరి పోరులోనైనా ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంటాడా చూడాలి. ఐపీఎల్-15వ సీజన్ నుంచి ఉత్తుంగతరంగంలా ఎగసిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాట్తో ఆకట్టుకుంటున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ కూడా తమ వంతు కృషి చేస్తే టీమ్ఇండియా భారీ స్కోరు చేయడం ఖాయమే. బౌలింగ్లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ ముందుండి నడిపిస్తుండగా.. అవేశ్, హర్షల్ అతడికి అండగా నిలుస్తున్నారు. చాహల్, అక్షర్ పటేల్ తమ స్పిన్కు పదును పెంచితే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, అవేశ్, భువనేశ్వర్, చాహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్)/హెన్రిక్స్, డికాక్, డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, జాన్సెన్, రబడ, కేశవ్ మహరాజ్, నోర్జే, ఎంగ్డీ.
పిచ్, వాతావరణం
ఇతర మైదానాలతో పోల్చుకుంటే బౌండరీ చిన్నగా ఉండే.. చిన్నస్వామి స్టేడియం వికెట్ బ్యాటింగ్కు అనుకూలించనుంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు. ఆదివారం 70 శాతం వర్షం పడే అవకాశం ఉండటం అభిమానులను కలవర పెడుతున్నది. శుక్రవారం రాత్రి ఇక్కడ భారీ వర్షం పడగా.. శనివారం మొత్తం చిరుజల్లులతో ఔట్ఫీల్డ్ చిత్తడిగా మారింది.