న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)..! దేశంలో 2008లో ఈ లీగ్ మొదలైంది..! అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 15 సీజన్లు పూర్తయ్యాయి..! ప్రస్తుతం కొనసాగుతున్నది 16వ సీజన్.! మరో ఐదు రోజుల్లో ఈ సీజన్ కూడా ముగియబోతున్నది..! ఈ సీజన్లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి..! టీమ్ టోటల్స్ పరంగా, సెంచరీల సంఖ్యపరంగా, సిక్సర్లు, బౌండరీల సంఖ్యపరంగా ఇలా లెక్కలేనన్ని రికార్డులు ఈ ఐపీఎల్ సీజన్లో నమోదయ్యాయి.
ఇక ఇవాళ్టి ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ప్లే ఆఫ్స్ మొదలవుతున్నాయి. ఈ రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య తొలి క్వాలిఫైయర్ జరుగనుంది. రెండు క్వాలిఫైయర్, ఒక ఎలిమినేటర్, చివరగా ఫైనల్ మ్యాచ్తో సీజన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అన్ని సీజన్ల ప్లే ఆఫ్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరనే ప్రశ్న తలెత్తింది. గణాంకాలను పరిశీలిస్తే CSK మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా పేరిట ఆ రికార్డు ఉంది.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో మొత్తం 24 ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనా 714 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఆ తర్వాత 21 ఇన్నింగ్స్ ఆడి 522 పరుగులతో CSK కెప్టెన్ ఎంఎస్ ధోని రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్ ప్లే ఆఫ్స్లో భారీ స్కోర్లు సాధిస్తే ధోని టాప్ ప్లేస్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక వీరి తర్వాత షేన్ వాట్సన్ 12 ఇన్నింగ్స్లో 389 పరుగులు, మైఖేల్ హస్సీ 11 ఇన్నింగ్స్లో 388 పరుగులు, ఫాఫ్ డూప్లెసిస్ 14 ఇన్నింగ్స్లో 373 పరుగులతో వరుసగా 3, 4, 5వ స్థానాల్లో ఉన్నారు.