ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్-2022 ప్రారంభంకానున్నది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ). తాజాగా తమదేశం నుంచి యూఏఈకి ఆసియా కప్ తరలివెళ్లడానికి గల కారణాలను శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఎస్ఎల్సీ కార్యదర్శి మోహన్ డిసిల్వా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘స్టేక్ హోల్డర్ల విశ్వాసాన్ని పొందేందుకు శ్రీలంకలో పరిస్థితులు అనుకూలంగా లేవని వాళ్లు (ఏసీసీ) భావించారు. ఈ మెగా ఈవెంట్ జరగాలంటే కేవలం సభ్యదేశాల అండ మాత్రమే కాదు.. బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు కూడా కావాలి. కానీ దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పెట్రోల్ క్యూలు, ధరల పెరుగుదల, ఇతరత్రా విషయాలలో లంకపై వచ్చిన ప్రతికూల ప్రచారం కారణంగా వాళ్లు ఈ విషయంలో ఏం చేయలేకపోయారు..’ అని అన్నాడు.
ఆసియా కప్ను శ్రీలంకలోనే నిర్వహించేందుకు తాము శాయశక్తులా కృషి చేశామని ఎస్ఎల్సీ తెలిపింది. బోర్డులో సుదీర్ఘ చర్చలు జరిపి, సభ్యదేశాలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. లంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇక్కడికి రావడానికి సభ్యదేశాలు కూడా అంతగా ఆసక్తి చూపలేదని వాపోయింది.
ఇదిలాఉండగా ఆసియా కప్ వేదిక మారినా ఆథిత్య హక్కులు మాత్రం లంక వద్దే ఉన్నాయి. లంక బోర్డుతో పాటు యూఏఈలు ఈ టోర్నీ నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. ఆగస్టు 27న శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.