Anand Mahindra on Dhoni | ఐపీఎల్-16 (2023) సీజన్ ట్రోఫీ విజేత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో ఎటువంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోనీ (ఎంఎస్ ధోనీ) నాయకత్వ ప్రతిభతోనే సీఎస్కే ట్రోఫీ గెలుచుకున్నదని పలువురు ప్రముఖులు, ఆటగాళ్లు, రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధోనీ నాయకత్వ ప్రతిభను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా.. ధోనీపై చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరలైంది. భవిష్యత్ నాయకుడు ధోనీ అంటూ.. ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆనంద్ మహీంద్రా సూచించారు.
`మరో ఏడాది కూడా ఐపీఎల్లో ఎంఎస్ ధోనీ ఆడితే చూడాలనుకున్న వారిలో నేనూ ఒకడ్ని. ఎక్కువ కాలం అలా జరగాలని ఆశించలేం. రాజకీయాలపైనా ధోనీ ఆలోచిస్తారని నమ్ముతున్నా. ఆటలో చురుగ్గా ఉన్నట్లే.. ఇతర అంశాల్లో అంతే చురుగ్గా ఉంటాడు. ఇతరులతో సులువుగా కలిసిపోయే మనస్తత్వం గల వాడు. ఎంతో వినయంగా ఉంటాడు. వినూత్నంగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఆయన భవిష్యత్ నాయకుడు`
ఆనంద్ మహీంద్రా ట్వీట్పై ధోనీకి నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. 2024,2025 ఐపీఎల్ సీజన్ల్లో ఆడాలని, ఐపీఎల్ ఫ్యాన్స్ ఆటలో ధోనీ గురించి మర్చిపోండి.. సరికొత్త ధోనీని చూడాలని ఆశిద్దాం అంటూ ట్వీట్లు చేశారు. అయితే, ఐపీఎల్-16 సీజన్ ధోనీకి చివరి సీజన్ అని కొంత కాలంగా వార్తలొస్తున్న నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా ట్వీట్పై సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది.