Timed Out: వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్ – శ్రీలంక మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో లంక వెటరన్ బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ‘టైమ్డ్ ఔట్’ అయిన బ్యాటర్గా నిష్క్రమించాడు. మాథ్యూస్ నిష్క్రమణతో ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చ అంతా ఈ అంశం మీదే నడుస్తోంది. మరి మాథ్యూస్ కంటే ముందు ఈ రకంగా ఔట్ అయిన వారు ఎవరైనా ఉన్నారా..? అంటే సమాధానం అవుననే చెప్పాలి. అయితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ లో కాదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చోటుచేసుకోవడం గమనార్హం.
ఏంటీ టైమ్డ్ ఔట్..?
క్రికెట్ చట్టాలు చేసే మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్ ఔట్ అయినా లేదా రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగినా తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్ రెండు నిమిషాలలో బంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో ఇన్కమింగ్ బ్యాటర్ను టైమ్డ్ ఔట్ రూల్ కింద ఔట్గా ప్రకటిస్తారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో మాథ్యూస్ ఈ రూల్ కారణంగానే నిష్క్రమించాడు.
ఆ ఆరుగురు ఎవరంటే..
మాథ్యూస్ కంటే ముందు క్రికెట్ లో ఈ రకంగా ఔట్ అయినవారు ఆరుగురు క్రికెటర్లు ఉన్నారు. సౌతాఫ్రికాలో ఈస్టర్న్ ప్రావిన్స్ వర్సెస్ ట్రాన్స్వాల్ మధ్య జరిగిన ఓ మ్యాచ్లో ఆండ్రూ జోర్డాన్ ఇలాగే ఔటయ్యాడు. ఆసక్తికర విషయమేంటంటే.. వరదల కారణంగా ఆండ్రూ జోర్డాన్ స్టేడియానికి రావడం లేట్ అవడంతో అతడిని అంపైర్లు ఔట్గా ప్రకటించారు. సౌతాఫ్రికాలోనే బార్డర్ వర్సెస్ ఫ్రీ స్టేట్ మధ్య జరిగిన ఓ మ్యాచ్లో వాస్బర్ట్ డ్రేక్స్ కూడా టైమ్డ్ ఔట్ అయ్యాడు. ఈ గేమ్ కోసం డ్రేక్స్ ఫ్లైట్ ఆలస్యం కావడం వల్ల గ్రౌండ్కు రాక ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్లోని నాటింగ్హామ్షైర్ వర్సెస్ డర్హమ్ మధ్య మ్యాచ్లో ఛార్లెస్ కుంజే.. క్రీజులోకి నిర్ణీత సమయంలోపు రాకపోవడంతో అంపైర్లు అతడికి షాకిచ్చారు. ఇంగ్లండ్కే చెందిన కాంబ్ సీ అండ్ సీ వర్సెస్ విండ్వార్డ్ మధ్య జరిగిన మ్యాచ్లో ర్యాన్ అస్టిన్ ఇదే రీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది. జింబాబ్వేకు చెందిన దేశవాళీ జట్లు మటబిలాండ్ వర్సెస్ మౌంటెనర్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్లో చార్లెస్ కుంజే కూడా టైమ్డ్ ఔట్ అయ్యాడు.
Angelo Mathews is the first man to be timed out in an international game, but there have been other reported instances in first class cricket. ⏰
There are some bizarre ones here! #BBCCricket #CWC23 #BANvSL pic.twitter.com/ZQa7TvAwTT
— Test Match Special (@bbctms) November 6, 2023
భారత్ నుంచి కూడా..
ఈ జాబితాలో భారత్ నుంచి ఓ క్రికెటర్ ఉన్నాడు. దేశవాళీలో త్రిపుర తరఫున ఆడిన హేములాల్ యాదవ్.. 1997 రంజీ సీజన్లో ఒడిషా – త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ చేసేందుకు తన వంతు వచ్చినా క్రీజు లోకి వెళ్లకుండా బౌండరీ లైన్ వద్ద కోచ్తో ముచ్చట్లు పెట్టుకుంటూ గడిపాడు. దీంతో అంపైర్లు రెండు నిమిషాల తర్వాత అతడిని ఔట్గా ప్రకటించారు.