ODI World Cup 2023 : సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో గెలుపొంది ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్లను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో శ్రీలంకతో తలపడనుంది.
నెల క్రితమే ఆసియా కప్ ఫైనల్లో లంకును చావు దెబ్బ కొట్టిన టీమిండియా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. స్వదేశంలో భారీ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కుశాల్ మెండిస్ సేన భావిస్తోంది. రికార్డులు తిరగేస్తే.. వరల్డ్ కప్లో భారత్, లంక ఇప్పటివరకూ 9 సార్లు ఎదురుపడ్డాయి. అయితే.. రెండు జట్లు చెరో నాలుగసార్లు గెలుపొందగా.. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. దాంతో, ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ దెబ్బకు 50 పరుగులకే కుప్పకూలిన లంక.. ఈసారి ఏమేరకు ప్రతిఘటిస్తుంది అనేది చూడాలి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్లతో టీమిండియా బలమైన బ్యాటింగ్ లైనప్ మాత్రమే కాదు.. బుమ్రా, సిరాజ్, షమీ, కుల్దీప్ యాదవ్లతో బౌలింగ్ యూనిట్ పటిష్టంగా కనిపిస్తోంది. లంక విషయానికొస్తే.. కెప్టెన్ మెండిస్, నిస్సంక, సమరవిక్రమ మాత్రమే ఫామ్లో ఉన్నారు. ఇక బౌలింగ్లో దునిత్ వెల్లలాగే నుంచి భారత బ్యాటర్లకు ముప్పు పొంచి ఉన్నది. కానీ, డబుల్ హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టును నిలువరించడం లంకకు శక్తికి మించిన పనే.
భారత్: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్
శ్రీలంక: కుశాల్ మెండిస్(కెప్టెన్), నిస్సనక, కరుణరత్నె, సమరవిక్రమ, చరిత అసలంక, మాథ్యూస్, వెల్లాలగె/డిసిల్వా, రజిత, తీక్షణ, మదుశనక, చమీర.